జమ్మికుంట, జూన్ 11: రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అనేక పదవులు, గౌరవాన్ని పొందిన ఈటల రాజేందర్.. టీఆర్ఎస్లో ఉంటూనే నష్టపరిచే కార్యక్రమాలకు పాల్పడ్డారని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. కమ్యూనిస్టు భావాలున్న ఈటల బీజేపీలో ఎలా చేరుతారని ప్రశ్నించారు. ‘ప్రగతి భవన్ను బానిసల భవన్ అంటా వా?.. తలా, నాలుక ఉన్నోడు మాట్లాడే మాటలా?’ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం జమ్మికుంటలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్ల సమావేశంలో కొప్పుల మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 45 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతున్నాయని, కోటి ఎకరాలకు పైగా సాగుచేస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వచ్చే ఉపఎన్నికలో టీఆర్ఎస్ను గెలిపించి సీఎంకు బహుమతి ఇవ్వాలని కోరారు. రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, సుంకె రవిశంకర్, నాయకులు కృష్ణమోహన్రావు తదితరులు పాల్గొన్నారు.
జమ్మికుంట : హుజూరాబాద్ ప్రజలు అభివృద్ధి వైపే నిలబడుతారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నా రు. శుక్రవారం ఆయన జమ్మికుంట మండలంలోని మాచనపల్లి, జగ్గయ్యపల్లి, పెద్దపల్లి, మడిపల్లి, అంకుశాపూర్ గ్రామాల్లో పర్యటించారు. ఆయాచోట్ల ప్రజాప్రతినిధులు, స్థానికులతో అభివృద్ధిపై చర్చించారు.
హుజూరాబాద్: రాములోరి భూములు కాజేసిన మాజీ మంత్రి ఈటల నీతులు మాట్లాడటం సిగ్గుచేటని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్రావు అన్నారు. ఈటల ఒక అవినీతి పరుడని, భూకబ్జాదారుడని, బ్యాంకులను మోసగించిన ఆర్థిక నేరగాడని ధ్వజమెత్తారు. తన ఎదుగుదలకు కారణమైన సీఎం కేసీఆర్పై తప్పుడు ఆరోపణలు చేయడం ఈటలకే చెల్లిందన్నారు.
కమలాపూర్ : టీఆర్ఎస్ విద్యార్థి విభాగంలోనే కొనసాగుతామని కమలాపూర్ మండల ప్రధాన కార్యదర్శి మాట్ల మహేశ్వర్ స్పష్టంచేశారు. శుక్రవారం మండలంలోని శనిగరంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పింగిళి ప్రదీప్రెడ్డి, ఇంద్రసేనారెడ్డిని కలిశారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే పనిచేస్తామని పునరుద్ఘాటించారు. సమావేశంలో న్యాయవాది కలకోటి మహేందర్, నిశాంత్, సిద్దు, అఖిల్, రోహిత్, రాము, సాయి, ప్రవీణ్, బాలు తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందకుంట: రానున్న ఉపఎన్నికలో హుజూరాబాద్లో టీఆర్ఎస్ జెండానే ఎగురుతుందని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి స్పష్టంచేశారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని బుజూనూర్లో సీతంపేట, వంతడుపుల, రాచపల్లి మల్లన్నపల్లి గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో పల్లా మాట్లాడారు. సీఎం కేసీఆర్ రెండుసార్లు ఈటల రాజేందర్కు మంత్రిగా బాధ్యతలు కట్టబెట్టారని, అయినా పార్టీలో ఆత్మగౌరవం లేదంటూ ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేయడం ఆయనకే చెల్లిందన్నారు. ఈ సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, జడ్పీ చైర్పర్సన్ విజయ, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వకుళాభరణం కృష్ణమోహన్రావు తదితరులు పాల్గొన్నారు.