KTR | మేడ్చల్ మల్కాజ్గిరి : మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో వలస పక్షులకు ఓట్లు వేస్తే గెలిచిన తర్వాత మీకు కనబడరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలన్నారు. మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా కేటీఆర్ రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు.
గత ఎన్నికల్లో మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి స్వల్ప మెజార్టీతో గెలిచారని కేటీఆర్ గుర్తు చేశారు. రేవంత్ రెడ్డికి మల్కాజ్గిరి ఎంతో ఇచ్చింది. పీసీసీ, సీఎం పదవులు రావటానికి మల్కాజ్గిరి ప్రజలే కారణం. అలాంటి రేవంత్ రెడ్డి ఇక్కడి ప్రజలకు ఏం చేయలేదు. పార్లమెంట్లో పత్తా లేకుండా పోయిండు. ప్రజలకు కష్టం వస్తే కనబడకుండా పోయిండు. ఈ వలస పక్షులకు ఓట్లు వేస్తే గెలిచిన తర్వాత మీకు కనబడరు. మీకు 24 గంటలు అందుబాటులో ఉండే రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించండి అని ప్రజలను కేటీఆర్ కోరారు.
పదేళ్ల అభివృద్ధి కేసీఆర్ పాలన.. వంద రోజులు అబద్ధం రేవంత్ రెడ్డి పాలన అని కేటీఆర్ పేర్కొన్నారు. బడే భాయ్ మోదీ మనకు బడా మోసం చేసిండు. చోట భాయ్ రేవంత్ రెడ్డి మనల్ని ఇక్కడ మోసం చేసిండు. వంద రోజుల్లో అందరికీ అన్ని చేస్తా అంటూ చోటా భాయ్ మోసం చేసిండు. గద్దెనెక్కిన వెంబడే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. రుణమాఫీ అయ్యిందా? తులం బంగారం వచ్చిందా? మహిళలకు రూ. 2500 వచ్చినయా? పైన పెద్ద మోసగాడు…కింద చిన్న మోసగాడు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి మోసం పార్ట్ -1 అనే సినిమా చూపించిండు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు మోసం పార్ట్ -2 సినిమా చూపిస్తున్నాడు. ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ల మీద ఒట్టు వేసి రుణమాఫీ చేస్తా అంటున్నాడు. ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వాడి తప్పు. రెండో సారి మోసం పోతే మోసపోయిన వారిదే తప్పు. ఇప్పుడు ప్రజలంతా కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు అని కేటీఆర్ తెలిపారు.