హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): నూతనంగా నియామకమైన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) శుక్రవారం కొలువుదీరుతున్నది. కమిషన్ చైర్మన్గా నియమితులైన డాక్టర్ బీ జనార్దన్రెడ్డితోపాటు సభ్యులుగా రమావత్ ధన్సింగ్, ప్రొఫెసర్ బండి లింగారెడ్డి, కోట్ల అరుణకుమారి, సుమిత్రా ఆనంద్ తనోబా, కారం రవీందర్రెడ్డి, డాక్టర్ ఎరవెల్లి చంద్రశేఖర్రావు, ఆర్ సత్యనారాయణ శుక్రవారం ఉదయం 10.45 గంటలకు ప్రమాణం చేస్తారు. తొలుత టీఎస్పీఎస్సీ తాత్కాలిక చైర్మన్గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ చింతా సాయిలు కొత్త చైర్మన్ జనార్దన్రెడ్డితో ప్రమాణం చేయిస్తారు. ఆ వెంటనే జనార్దన్రెడ్డి బాధ్యతలు స్వీకరిస్తారు. దీంతో సాయిలు తాత్కాలిక చైర్మన్ పదవి నుంచి వైదొలిగి సభ్యుడి హోదాలోకి మారతారు. అనంతరం చైర్మన్ కొత్త సభ్యులతో విడివిడిగా ప్రమాణం చేయిస్తారు. కొవిడ్ నేపథ్యంలో ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. కొత్త సభ్యులందరికీ భారత రాజ్యాంగం, టీఎస్పీఎస్సీకి సంబంధించిన నివేదికలను అందజేస్తారు. ఆ తర్వాత కమిషన్ భేటీ అవుతుంది.
వీఆర్ఎస్.. ఆ వెంటే బాధ్యతల స్వీకరణ
టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమితులైన ఐఏఎస్ అధికారి బీ జనార్దన్రెడ్డి శుక్రవారం ఉదయం 10 గంటలకు స్వచ్చంద పదవీ విరమణ చేయనున్నారు. సభ్యులుగా నియమితులైన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ కోట్ల అరుణకుమారి, ప్రభుత్వ టీచర్ సుమిత్ర ఆనంద్ తనోబాలు గురువారమే వీఆర్ఎస్ తీసుకొన్నారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 319 (ఏ)ప్రకారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యులుగా నియమితులైన వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎలాంటి ఉద్యోగం చేయరాదు. దాంతో ఈ ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకొంటున్నారు. అరుణకుమారి గురువారం జీఏడీలో వీఆర్ఎస్కు దరఖాస్తు సమర్పించారు. సుమిత్ర ఆనంద్ తనోబా సమర్పించిన వీఆర్ఎస్ దరఖాస్తును కూడా కామారెడ్డి డీఈవో ఆమోదించారు.