వాషింగ్టన్, మే 6: కొవిడ్-19 సెకండ్ వేవ్ భారత్ను ‘సునామీ’లా ముంచెత్తుతున్నదని బయోకాన్ సంస్థ వ్యవస్థాపక సీఎండీ కిరణ్ మజుందార్ షా ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల వివిధ రాష్ర్టాల్లో జరిగిన ఎన్నికలు, మతపరమైన కార్యక్రమాల వల్లే దేశంలో కరోనా వైరస్ కేసులు అనూహ్యంగా పెరిగాయన్నారు. ఎన్నికల వల్ల పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాలకు కరోనా మహమ్మారి వ్యాపించిందన్నారు. గ్లోబల్ వ్యాక్సిన్ ఈక్విటీపై వన్ షేర్ వరల్డ్ నిర్వహించిన వర్చువల్ చర్చాగోష్ఠిలో ఆమె మాట్లాడుతూ.. కరోనా కేసుల పెరుగుదల వల్ల దవాఖానల్లో బెడ్లు, ఆక్సిజన్కు అసాధారణ రీతిలో డిమాండ్ పెరిగిందన్నారు.
దేశంలో రోజురోజుకూ విపరీతంగా పెరుగుతుతన్న కొవిడ్ కేసులకు తగ్గట్టుగా చికిత్స అందించేందుకు తగినన్ని బెడ్లు, వైద్య సదుపాయాలు, సిబ్బంది లేకపోవడం విచారకరమని మజుందార్ షా పేర్కొన్నారు. దేశంలో జనాభా అధికంగా ఉండటం వల్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ పెద్ద సవాలుగా మారిందని, ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు తగినన్ని టీకాలు కూడా లేవని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్కు సాయమందించేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావడం స్వాగతనీయమన్నారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలవడానికి ముందు వివిధ దేశాలకు భారత్ కొవిడ్ టీకాలను విరాళంగా ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ.. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయన్నారు. భారత్ సురక్షితంగా లేదంటే ప్రపంచం కూడా సురక్షితంగా లేనట్టేనని కిరణ్ మజుందార్ షా పేర్కొన్నారు.