ఇంటి చైతన్యం రావాలి
మహిళా పారిశ్రామికవేత్తలకు సర్కారు ప్రోత్సాహం
సమాజాన్ని చదువగలిగేది మహిళలే..
పింఛన్ల పంపిణీతో అండగా నిలుస్తున్న సర్కార్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహిళకు టికెట్ ఇచ్చి గెలిపించిన ఘనత సీఎం కేసీఆర్దే..
పరిగిలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి
పేదలకు కుట్టుమిషిన్లు, పాఠశాలకు డ్యూయల్ డెస్క్లు పంపిణీ
పరిగి, మార్చి 21 :అమ్మ అందరికీ రోల్ మోడల్ అని, ఇంటి నుంచే మహిళల్లో మార్పు రావాలని విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం పరిగిలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నదన్నారు. ఒంటరి మహిళలకు పింఛన్లను అందజేస్తూ అండగా నిలుస్తున్నదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలిసారిగా మహిళకు టికెట్ ఇచ్చి, గెలిపించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా పలువురు పేద మహిళలకు కుట్టుమిషిన్లు, పాఠశాలకు డ్యూయల్ డెస్క్లను మంత్రి అందజేశారు.
మహిళా పారిశ్రామికవేత్తలకు సర్కారు ప్రోత్సాహం అందజేస్తున్నదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఆదివారం పరిగిలో జరిగిన అంతర్జాతీయ మహిళా వారోత్సవాల్లో భాగంగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. జిల్లా పరిధిలోని మోమిన్పేట్లో స్వయం సహాయక సంఘాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం చేయూత అందించడంతో వారు వ్యాపారంలో రాణిస్తున్నారన్నారు. చదువుతో సంస్కారం, అవగాహన వస్తుందన్నారు.
అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి..
ఒంటరి మహిళలకు సర్కారు అండగా ఉంటూ పింఛన్ సదుపాయం కల్పిస్తున్నదన్నారు. మహిళలకు గొప్ప క్షమాగుణం ఉంటుందని, రాజకీయంగా అవకాశాలు సద్వినియోగం చేసుకుని మరింత ఎత్తుకు ఎదుగాలని మంత్రి ఆకాంక్షించారు. మహిళా సర్పంచ్లు గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మొదటిసారి మహిళకు టికెట్ ఇచ్చి గెలిపించారని మంత్రి పేర్కొన్నారు. కుటుంబానికి ఆసరాగా ఉంటూ సమాజంలో పది మందికి సహాయం చేయడానికి పదవులే అక్కర లేదన్నారు. సమాజంలో మార్పు ఇంటి నుంచే మొదలు కావాలని మంత్రి సబితారెడ్డి అన్నారు. అమ్మ అందరికీ రోల్ మోడల్ అని తెలిపారు.
50 శాతం రిజర్వేషన్లు రావాలి..
జడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ చట్టసభల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు రావాలని అన్నారు. తద్వారా చట్టాలు చేసే స్థాయికి మహిళలు ఎదుగుతారన్నారు. వ్యవసాయంలో రాణిస్తున్న మహిళా రైతులకు గుర్తింపు రావాలని అన్నారు. బాల్య వివాహాలను నివారించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
కొడుకు, కూతురును సమానంగా చూడాలి..
పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు అమ్మాయిలు, అబ్బాయిలను సమానంగా చూడాలని సూచించారు. అమ్మాయిలు ఏ రంగం ఎంచుకుంటే అదే రంగంలో ఉన్నత చదువు చదివేందుకు ప్రోత్సహించాలన్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో తమ పిల్లలను చదివిస్తున్నారని, ఉన్నత చదువుల వరకు తల్లిదండ్రుల ప్రోత్సాహం అవసరమని చెప్పారు. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా మాట్లాడుతూ.. మహిళ ఆర్థిక అభివృద్ధ్దికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా పేద మహిళలకు కుట్టు మిషన్లు, పాఠశాలకు డ్యూయల్ డెస్క్లను మంత్రి సబితారెడ్డి పూడూరు జడ్పీటీసీ మలిపెద్ది మేఘమాల-ప్రభాకర్గుప్తా దంపతులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురిని మంత్రి సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ విజయకుమార్, జడ్పీటీసీలు కొప్పుల నాగారెడ్డి, మలిపెద్ది మేఘమాల, బి.హరిప్రియ, రాందాస్, ఎంపీపీలు కె.అరవిందరావు, అనుసూజ, మల్లేశం, సత్యమ్మ, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కె.ప్రసన్నలక్ష్మి, ఎమ్మెల్యే సతీమణి కె.ప్రతిమారెడ్డి, నాయకులు కొప్పుల అనిల్రెడ్డి, శ్రీదీప్తి, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్నాథ్, మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.