నాటేసేందుకు వెళ్లి ఇద్దరు మహిళల దుర్మరణం
మరో మహిళకు తీవ్ర గాయాలు
తొర్రూరు మండలం వెలికట్టలో ఘటన
మంత్రులు సత్యవతి, ఎర్రబెల్లి సంతాపం
బాధిత కుటుంబాలకు రూ.6లక్షల చొప్పున పరిహారం ఇస్తామని వెల్లడి
తీగరాజుపల్లిలో చలిపిడుగు
అంత్యక్రియలకు వెళ్లిన వారు ఆగమాగం
షాక్తో స్పృహ కోల్పోయిన 20 మంది
తొర్రూరు, జూలై 6: వారిది రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. రోజువారీ కూలీకి వెళ్తేనే కుటుంబ పోషణ సాగుతుంది. ఇలాంటి రెండు కుటుంబాలపై పిడుగు మృత్యువు రూపంలో వచ్చి ఇద్దరి ప్రాణాలను బలిగొన్నది. ఎస్సై మున్నీరుల్లా కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట గ్రామానికి చెందిన మహిళలు మంగళవారం శివారులోని రైతు మాలోత్ దేవులా పొలంలో వరి నాటు వేసేందుకు వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో భారీ వర్షం పడడంతో కొమ్ము సాయమ్మ(45), కొమ్ము అమరేశ్వరి(25), కొమ్ము ఉపేంద్ర అనే ముగ్గురు మహిళలు సమీపంలో ఉన్న తాటి చెట్టు కింద నిల్చున్నారు. ఆ చెట్టు పక్కన పిడుగు పడడంతో సాయమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. అమరేశ్వరి, ఉపేంద్రకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు తొర్రూరులోని ప్రైవేట్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ అమరేశ్వరి మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలాన్ని తహసీల్దార్ వేంరెడ్డి రాఘవరెడ్డి, ఎస్సై సందర్శించారు. ఎంపీపీ తుర్పాటి చిన్న అంజయ్య, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, సర్పంచ్ పోసాని పుష్పలీల, ఎంపీటీసీ బత్తుల మల్లమ్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ అనుమాండ్ల దేవేందర్రెడ్డి, పార్టీ గ్రామ అధ్యక్షుడు దేవేందర్రావు, మాజీ సర్పంచ్ దామోదర్రావు, పోసాని రాములు, బత్తుల యాకయ్య, కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ నివాళులర్పించారు.
సంతాపం తెలిపిన మంత్రులు
పిడుగు పడిన విషయం తెలుసుకున్న మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ ఏరియా దవాఖానలో మృతదేహాలను సందర్శించి సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున అందజేశారు. అదేవిధంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఫోన్లో ‘నమస్తే’తో మాట్లాడుతూ మృతులకు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.6లక్షల చొప్పున ప్రభుత్వం తరఫున అందజేయనున్నట్లు తెలిపారు.
మండలంలోని తీగరాజుపల్లి గ్రామంలో మంగళవారం చలి పిడుగు పడి 20 మంది స్పృహ కోల్పోయారు. బాధితులు, స్థానికుల కథ నం ప్రకారం.. గ్రామానికి చెందిన కారింగుల ప్రవీణ్ గుండెపోటుతో మృతి చెందగా, అంత్యక్రియల కోసం మృతదేహంతో బం ధువులు, స్థానికులు వెళ్తున్నారు. ఈ క్రమంలో వాతావరణం మేఘావృతమై గాలివాన ప్రారంభమైంది. తడువకుండా ఉండేందుకు కొందరు అక్కడే ఉన్న రావిచెట్టు కిందికి వెళ్లారు. ఇంతలోనే పెద్ద శబ్ధం, మెరుపులతో చెట్టు పక్కన చలి పిడుగు పడింది. దీంతో చెట్టుకింద ఉన్న 20 మంది షాక్కు గురై స్పృహ కోల్పోయారు. వెంటనే చుట్టుపక్కల వారు వచ్చి లేపి ప్రథమ చికిత్స చేశారు. నడువలేని స్థితిలో ఉన్న వారిని బండ్లమీద గ్రామ కూడలి వరకు తీసుకొచ్చారు. పుట్ట నరేశ్, పూజరి అరవింద్, మోడెం స్వరూప, దర్నోజు రాకేశ్, రావుల శంకర్, రేణుకను 108 అంబులెన్స్లో వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు.