వనపర్తి రెండు రేంజ్లలో 45 పాత, 12 కొత్త సాసర్ పిట్ల నిర్మాణం
చెక్ డ్యాంలు, నీటి కుంటల ఏర్పాటు
వేప మొక్కల పెంపకానికి ప్రణాళిక
వనపర్తి రూరల్, మే 8: జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరగడంతో అడవుల్లోని వాగులు, చెరువులు అడుగంటిపోయాయి. దీంతో వన్య ప్రాణులకు నీరు దొరకక అల్లాడిపోతున్నాయి. వీటి దాహం తీర్చేందుకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లాలో రెండు రేంజ్ల పరిధిలో 60సాసర్ పిట్ల నిర్మాణం చేపట్టగా.. అడవుల్లో గుంతలను ఏర్పాటు చేసి అటవీ ప్రాంతాల్లోని జీవాలకు నీటిని అందిస్తూ వాటి దాహం తీరుస్తున్నారు. అటవీ ప్రాంతంలో పడిపోయిన చెట్ల స్థలాల్లో పెద్ద ఎత్తున వేప మొక్కలను నాటించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. జిల్లాలో వనపర్తి, ఘణపురం అటవీ రేంజ్లు ఉన్నాయి. ఈ అడవుల్లో వన్యప్రాణులకు ఆహారం లభించడంతో ఇతర ప్రాంతాల్లోని అడవి జంతువులు ఈ ప్రాంతాలకు వస్తున్నట్లు అటవీ అధికారులు పేర్కొంటున్నారు. ఎలుగుబంటి, జింకలు, కృష్ణ జింకలు, నెమళ్లు, కుందేళ్లు, అడవి కోళ్లు ఇతర జంతువుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నట్లు గతేడాది నిర్వహించిన సర్వే ఫలితాల్లో వెల్లడయ్యాయి. ఇదిలా ఉంటే జిల్లాలో రోజురోజుకూ గరిష్ట ఉష్ణోగ్రతలు 40నుంచి 45 డిగ్రీల వరకు నమోదు కాగా.. భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. అడవుల్లో వాగులు, చెరువులు, కుంటలు అడుగంటి పోవడంతో వన్యప్రాణులకు అడవుల్లో నీటి వసతి లేక అల్లాడిపోతున్నాయి. ఈ తరుణంలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ రెండు రేంజ్ పరిధిల్లో గతంలో 25 సాసర్ పిట్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో ట్రాక్టర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి పోస్తున్నారు. వనపర్తి మండలంలో ట్యాంక్ నుంచి అడవులోకి నీళ్లను తీసుకెళ్లి వన్యప్రాణులకు నీరు అందిస్తున్నారు. వాగుల్లో చెలిమెలను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా వేసవిలో అడవి జంతువుల దాహార్తి తీర్చడానికి అధికారులు నీరందిస్తున్నారు.
నీటి సమస్యకు ప్రణాళిక
అడవులో వన్యప్రాణులకు నీటి సమస్యను గుర్తించిన అటవీశాఖ అధికారులు ముందస్తుగా ప్రణాళికలను తయారు చేశారు. జిల్లా వ్యాప్తంగా అటవీశాఖ రేంజ్ల పరిధిలో జంతువులకు తాగునీటి సమస్య లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తున్నారు. వనపర్తి అటవీ ప్రాంతంలో పాతవాటితోపాటు మరో 20 కొత్త సాసర్ పిట్ల గుంతలను ఏర్పాటు చేసి అందులో నీటిని నింపుతున్నారు. వివిధ ప్రదేశాల్లో జంతువుల కోసం నీటిని తాగేందుకు తొట్టెలు ఏర్పాటు చేశారు. ట్యాంకర్ల ద్వారా నీటి తొట్టెలో నీటిని నింపుతున్నారు., జిల్లా వ్యాప్తంగా 60చోట్ల జంతువులకు తాగునీటి కోసం సాసర్ పిట్లతోపాటు గుంతలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ ఏడాది జిల్లాలోని రెండు రేంజ్లలో రెండు చెక్ డ్యాంలను, నీటి కుంటలను నిర్మించారు. జూన్లో వర్షాలు వర్షాలు కురిసి అడవుల్లో నీరు నిలిచే వరకు వన్యప్రాణులకు నీటి సరఫరా చేయనున్నారు.