సివిల్స్ ర్యాంకర్ పృథ్వీనాథ్ గౌడ్ ను సన్మానించిన మంత్రి దంపతులు
వనపర్తి: పట్టుదలతో శ్రమిస్తే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇటీవల సివిల్స్లో ప్రతిభ కనబరిచిన పృథ్వీనాథ్ గౌడ్ను మంత్రి నిరంజన్ రెడ్డి, వాసంతి దంపతులు సోమవా రం స్వయంగా హైదరాబాద్ చైతన్యపురి మారుతినగర్లోని అతని నివాసానికి వెళ్లి అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వనపర్తికి చెందిన పృథ్వీనాథ్ గౌడ్ సివిల్స్ పరీక్షలో 541వ ర్యాంకు సాధించడం జిల్లాకు గర్వకారణమన్నారు. నేటి యువతకు ఆదర్శంగా నిలిచాడని , ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిరంతరం శ్రమిస్తేనే విజయం సాధ్యమని రుజువు చేశాడన్నారు.
ఎంబీబీఎస్ పూర్తి చేసినా, సివిల్స్ లక్ష్యంగా పెట్టుకుని ప్రజాసేవ చేయాలని భావించడం అందరికి ఆదర్శమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో పృథ్వీనాథ్ తల్లిదండ్రులు వనజ, శ్రీనివాస్గౌడ్, బంధువులు మధుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.