డ్యామేజ్ చేయాలని చూస్తే సహించేది లేదు
తీరు మారకపోతే పరువునష్టం దావా వేస్తా..
ప్రెస్మీట్లో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు
అచ్చంపేట, మే 22: తప్పుడు ఆరోపణలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ చిల్లర మాటలు మానుకోవాలని, తన వ్యవహారశైలి మార్చుకోకుంటే పరువునష్టం దావా వేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, పార్టీ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు హెచ్చరించారు. అచ్చంపేట క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. వ్యక్తిగత విషయాల్లో కోపం అనే నరాన్ని తెంచుకొని ఓపిక, సహనంతో వ్యవహరిస్తున్నానన్నారు. తనను పదేపదే నాన్లోకల్ అంటున్న వంశీకృష్ణ భార్య ఎక్కడ పుట్టిందో చెప్పాలని, రేవంత్రెడ్డి, మల్లురవి ఎక్కడి నుంచి వచ్చారో చెప్పాలన్నారు. రూ.4.75కోట్ల ఎంఎఫ్టీ నిధులను అన్ని మండలాల్లో మినీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల ఏర్పాటు, అచ్చంపేట ఎన్టీఆర్ స్టేడియం, ఇండోర్స్టేడియం, పదరలోని చెన్నకేశవస్వామి ఆలయంలో కమ్యూనిటీ హాల్ పూర్తి చేయడానికి రూ.70 లక్షలు కేటాయించినట్లు చెప్పారు.
నిధులు దేనికోసం కేటాయించారో తెలుసుకోకుండా రూ.కోటీ 50లక్షలు డ్రా చేసినట్లు తప్పుడు ఆరోపణలతో తన ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్న వంశీకృష్ణ వాస్తవాలు నిరూపించకపోతే పరువునష్టం దావా వేస్తానని ధ్వజమెత్తారు. వాడు, వీడు, నీ అమ్మ అంటూ మాట్లాడుతున్న మాటలు క్షమించరానివని మండిపడ్డారు. ప్రజలు నిన్ను నమ్మడం లేదని తెలుసుకొని నీ భార్యను నిలబెట్టేందుకు బతిమిలాడుతున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏదో ఓ కాగితం పట్టుకొచ్చి ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేసినంత మాత్రాన ప్రజలు నమ్మలేరని, తన గురించి ప్రజలకు అన్నీ తెలుసన్నారు. తాను ఎప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలు చేయనని, అంబేద్కర్ కల్పించిన ఓటుహక్కును ప్రజలు ఎవరికైనా వేసుకుంటారన్నారు. అంతరించిపోతున్న చెంచుజాతిని కాపాడేందుకు తమవంతుగా సేవలందిస్తుంటే జీర్ణించుకోలేక గుప్తనిధులు తవ్వేందుకు వెళ్తున్నారని చెప్పడానికి సిగ్గుండాలని మండిపడ్డారు.
అడవిలో ఉన్న సీసీ కెమెరాలు తెప్పించుకొని చూడాలన్నారు. వంశీకృష్ణ నా స్థాయికి తగిన వ్యక్తి కాకున్న పనికిమాలిన వ్యక్తి అయినా తప్పదు.. ప్రతిపక్ష పార్టీ కాబట్టి ఈ ఒక్కసారి క్లారిటీ ఇచ్చి వదిలేయమని తన పార్టీ నాయకులు అంటే క్లారిటీ కోసం మాట్లాడుతున్నా అని అన్నారు. కాంగ్రెస్ నాయకులు అసమర్థులు కాబట్టే దేశంలో ఆ పార్టీ పనైపోయిందన్నారు. దేశ ప్రజల బతుకుల్లో మార్పు తెచ్చేందుకు సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారని తెలిపారు. తనకంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ప్రజాసేవలోనే ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పోకల మనోహర్, నాయకులు తులసీరాం, పర్వతాలు, అమినోద్దీన్, లోక్య, రాజేశ్వర్రెడ్డి, రాంబాబు, గోపాల్నాయక్, నిజామొద్దీన్, ఖలీ ల్, లింగం, శంకర్మాదిగ, రాజు తదితరులు పాల్గొన్నారు.