న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ కేటాయింపులపై ఇవాళ లోక్సభలో చర్చ జరిగింది. టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి దీనిపై మాట్లాడారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టాలన్న కేంద్ర ఆలోచన బాగుందని, కానీ తెలంగాణలో కేవలం 17 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని, మిగితా 17 కాలేజీలను త్వరగా ఏర్పాటు చేయాలని ఎంపీ రంజిత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎయిమ్స్ మెడికల్ కాలేజీలో సీట్ల సంఖ్యను పెంచాలన్నారు. ఆయుష్మాన్ భారత్లో ఎన్రోల్మెంట్లో తక్కువ సంఖ్యలో జరుగుతోందని, బిల్లులను తక్షణమే చెల్లించాలని కోరారు. కిడ్నీ పేషెంట్ల గురించి ప్రస్తావిస్తూ.. పేద కిడ్నీ పేషెంట్లకు పెన్షన్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. తెలంగాణలో పది వేల మంది కిడ్నీ రోగులు ఉన్నారని, వారికి ఆసరా స్కీమ్ కింద పెన్షన్ ఇచ్చేందుకు తెలంగాణ సర్కార్ ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫ్లోరయిడ్ వల్ల కిడ్నీ, డయాలసిస్ సమస్యలు వస్తున్నాయని, దాన్ని రూపుమాపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఇంటికి ఉచిత, మెరుగైన తాగు నీరు అందిస్తోందన్నారు. ఆరోగ్య సంక్షేమ శాఖ నియంత్రణలో ఉండే గ్రాంట్లు కోసం డిమాండ్లపై జరిగిన చర్చకు, ఓటింగ్కు సపోర్ట్ ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.