మోమిన్పేట, మే 19: కరోనా విజృంభన దృష్ట్యా ప్రభుత్వ దవాఖానల్లో అదనంగా బెడ్లు ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సొంతంగా ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాన్ని బుధవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లడుతూ ఎమ్మెల్యే సొంతంగా 50 పడకల ఐసొలేషన్ కేంద్రం ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. జిల్లాలో కొవిడ్కు సంబంధించిన అన్ని రకాల మందులు, ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని, జిల్లా ఆస్పత్రుల్లో బెడ్లు పెంచామని అన్నారు. అందరికీ వ్యాక్సిన్ కోసం ప్రభుత్వం గ్లోబల్ టెండర్లు ఆహ్వానించిందన్నారు. జిల్లా కేంద్రంలో ఆర్టీపీసీఆర్ కేంద్రం ఏర్పాటుతోపాటు సీఎం కేసీఆర్ ఆదేశాలతో అనంతగిరిలో 200 పడకల ఆస్పత్రిని అందుబాటులోని తీసుకొస్తామని తెలిపారు. ఊరూరా జ్వర సర్వేలో కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వైద్యసిబ్బంది మందులు ఇస్తూ సూచనలు చేస్తుండడంతో చాలా వరకు కేసులు తగ్గుతున్నాయన్నారు. గ్రామాల్లో ఎంపీటీసీలు, సర్పంచులు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు సమన్వయం చేసుకుని కరోనా లక్షణాలు ఉన్న వారు కొవిడ్ వ్యాప్తి చెందకుండా హోం ఐసొలేషన్లో ఉండేలా కృషి చేయాలన్నారు. మోమిన్పేట జ్వర సర్వేలో 250 మందికి లక్షణాలు ఉన్నట్లు గుర్తించి, వారికి వెంటనే మందుల కిట్ను అందించాలని డాక్టర్లను ఆదేశించారు.
అన్ని సదుపాయలతో ఐసొలేషన్ కేంద్రం: ఎమ్మెల్యే ఆనంద్
కరోనా సోకి ఇంట్లో ఉన్నవారికి ఇబ్బందిగా ఉండేవారి కోసం మోమిన్పేటలో 50 పడకలతో అన్ని సదుపాయాలతో ఐసొలేషన్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. గ్రామాల్లో మధ్య తరగతి ప్రజలు కొవిడ్ బారినపడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వ్యక్తిగత గదులు లేకపోవడంతో ఒకే గదిలో కుటుంబం నివసించాల్సి రావడం మూలంగా హోమ్ క్వారంటైన్లో ఉండలేక సతమతమవుతూ ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేంద్రంలో ఉండేవారికి మూడు పూటల భోజనం, పౌష్టికాహారం, మంచి నీరు, టీవీ, పేపర్ వంటి సదుపాయలతో పాటు నిరంతరం ఏఎన్ఎం, ఆశవర్కర్లు, డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటారని తెలిపారు. ఎప్పటికప్పుడు ఆక్సిజన్, పల్స్ రేట్ చెక్ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మోతీలాల్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, ఎంపీపీ వసంత వెంకట్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి, సొసైటీ అధ్యక్షుడు అంజిరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, టీఎస్ఈడబ్ల్యూడీసీ చైర్మన్ నాగేందర్ గౌడ్, రైతుబంధు అధ్యక్షుడు విఠల్, డీఎంహెచ్వో సుధాకర్ షిండే, ఆర్డీవో ఉపేందర్ రెడ్డి, డీఎస్వో అరవింద్, మండల ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు, ఆధికారులు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
జ్వర సర్వే పరిశీలన..
పరిగి, మే 19: జ్వర సర్వేలో లక్షణాలు ఉన్న వారికి మెడికల్ కిట్లు అందించి హోం ఐసొలేషన్లో ఉంచాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితి ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే మహేశ్రెడ్డి, కలెక్టర్ పౌసుమి బసుతో కలిసి పరిగి పట్టణ కేంద్రంలో రెండోవిడత జ్వర సర్వేతో పాటు దవాఖానను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటింటా సర్వే కరోనా కట్టడికి చాలా తోడ్పడుతుందన్నారు. ఆశా కార్యకర్తలతో మంత్రి స్వయంగా మాట్లాడి జ్వర సర్వే వివరాలను తెలుసుకున్నారు. అదేవిధంగా కాలనీలో ప్రజలతో మాట్లాడి ఏ మేరకు వైద్య సేవలు అందుతున్నాయో ఆరా తీశారు. అనంతరం ఏరియా ఆసుపత్రిని సందర్శించిన మంత్రి కరోనా కట్టడికి, పరీక్షలకు తీసుకొంటున్న చర్యలను పరిశీలించారు. కరోనా బారిన పడిన వారికే కాకుండా సాధారణ వ్యాధితో బాధపడుతున్న వారికి కూడా వైద్యం అందించాలని సూచించారు. గర్భిణులకు అందుతున్న వైద్య సేవలను తెలుసుకున్నారు. కొవిడ్ టెస్టుల వివరాలు తెలుసుకోవడంతో పాటు త్వరలో వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. కరోనా కట్టడిపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ, ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అనంతగిరిలో ముఖ్యమంత్రి ఆదేశాలతో బెడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సరిపడ మందులు ఆక్సిజన్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. లాక్డౌన్లో ప్రజలు ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు. ఇంట్లో ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, మున్పిల్ చైర్మన్ ముకుందా అశోక్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రవీణ్రెడ్డి, కౌన్సిలర్ అర్చన, దవఖాన ఇంచార్జి డా.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.