ఎన్నేపల్లి శివారులో సర్వే నం.243లో స్థలం కేటాయింపు
రూ.6కోట్లతో నిర్మాణానికి ప్రతిపాదనలు
ఈ నెలలో శంకుస్థాపనకు ఏర్పాట్లు
వికారాబాద్, ఆగస్టు 3, (నమస్తే తెలంగాణ) : త్వరలోనే జడ్పీ భవన నిర్మాణానికి ముహూర్తం ఖరారు కానుంది. దీని నిర్మాణానికి సంబంధించి ఈ నెలలో భూమి పూజ చేయనున్నారు. నూతన కలెక్టర్ సమీపంలోనే జిల్లా ప్రజా పరిషత్ భవనానికి స్థలం కేటాయించారు. ఇటీవల రెవెన్యూ అధికారులు జడ్పీకి స్థలం అప్పగించారు. దీంతో అధికారులు నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వికారాబాద్ మండలం ఎన్నేపల్లి గ్రామ శివారులో సర్వే నం.243లో 3 ఎకరాలను కేటాయించినట్లు రెవెన్యూ అధికారుల నుంచి జిల్లా పరిషత్కు పత్రాలు అందాయి. 2019 జూలై 5న నూతన జిల్లా ప్రజా పరిషత్గా ఏర్పాటైంది. అప్పట్లో వికారాబాద్ మండల పరిషత్ కార్యాలయం కోసం నూతనంగా నిర్మించిన భవనంలోనే జడ్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
మొదటగా వికారాబాద్ జిల్లాకు చెందినవి 14 మండల పరిషత్లు కాగా.. మూడు మండలాలు (మహబూబ్నగర్ నుంచి కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్పేట) ఇందులో కలిశాయి. తర్వాత కోట్పల్లిలి నూతన మండలంగా ఏర్పాటు చేసి మొత్తం 18 మండలాలతో జిల్లా ప్రజాపరిషత్గా ఏర్పాటు చేశారు. 18 జడ్పీటీసీలు, 18 మంది ఎంపీపీలు, ఇద్దరు కో-ఆప్షన్ సభ్యులు ఉన్నారు. అంతకుముందు రంగారెడ్డి జిల్లా పరిషత్లో విధులు నిర్వర్తించిన ఉద్యోగులను వికారాబాద్ జిల్లాకు కేటాయించారు. అలాగే ఫర్నిచర్ను కూడా అక్కడి నుంచి ఇక్కడికి తీసుకువచ్చారు. అయితే కొత్త భవన నిర్మాణం కోసం స్థలం ఇవ్వాలని ప్రభుత్వం అప్పట్లోనే ఆదేశాలు జారీ చేసింది. జడ్పీలకు వివిధ రకాల నిధులతో పాటు వివిధ గ్రాంటు నిధుల కేటాయింపులు జరుగుతున్నాయి.
రూ.6కోట్లతో నిర్మాణానికి ఏర్పాట్లు
జిల్లా పరిషత్ జనరల్ ఫండ్ 16% నుంచి నిర్మాణానికి నిధులు కేటాయించారు. ఇవే కాకుండా మరో మూడు కోట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ నుంచి ఇవ్వాలని ప్రతిపాదనలు పంపారు. మొత్తంరూ.6కోట్లతో నిర్మాణం పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వికారాబాద్ నుంచి పరిగి వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకుని ఉంది. ఇక్కడ మూడు ఎకరాల స్థలంలో ఆధునాత భవనం నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే రాష్ట్ర పంచాయతీరాజ్కు పంపిన నిధులకు సంబంధించి ప్రతిపాదనలకు అనుమతులు త్వరలో వచ్చే అవకాశాలున్నాయి. జడ్పీ చైర్పర్సన్, ముఖ్య ప్రణాళిక అధికారి, డిప్యూటీ సీఈవో ఛాంబర్లు, సమావేశ మందిరం, వీడియో కాన్ఫరెన్స్ హాల్, మినిస్టీరియల్ స్టాఫ్కు సంబంధించి కార్యాలయ గదులతోపాటు రోడ్లు, గార్డెనింగ్, పార్కింగ్ తదితర మౌలిక వసతులు ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు.
ఈ నెలలోనే ముహూర్తం
పట్నం సునీతారెడ్డి, జడ్పీ చైర్పర్సన్, వికారాబాద్ జిల్లా జడ్పీ నూతన భవనానికి సంబంధించి ముహూర్తం ఈ నెలలోనే ఉంటుంది. నిర్మాణానికి సంబంధించి ఇటీవలే రెవెన్యూ శాఖ వారు స్థలం అప్పగించారు. జిల్లా పరిషత్ నుంచి జనరల్ ఫండ్ 16% నిధులు కేటాయించాం. రూ.3కోట్లతోపాటు పంచాయతీరాజ్ శాఖ నుంచి మరిన్ని నిధుల కోసం ప్రతిపాదనలు పెట్టాం.