వికారాబాద్, జూన్ 15, (నమస్తే తెలంగాణ) :రైతులు పెట్టుబడి కోసం అప్పులు చేయకుండా సాయమందిస్తూ తెలంగాణ ప్రభుత్వం కొండంత అండగా నిలిచింది. వికారాబాద్ జిల్లాలో మొత్తం 2,39,926 మంది రైతులు లబ్ధిదారులు ఉండగా, మొత్తం రూ.311.69 కోట్లు రైతుబంధు కింద అందజేయాల్సి ఉన్నది. మంగళవారం ఎకరానికి రూ. 5 వేల చొప్పున రూ.16.35 కోట్లను జమ చేయగా, 48,554 మంది రైతులు లబ్ధిపొందారు. జిల్లావ్యాప్తంగా లబ్ధిపొందిన అన్నదాతలు అదునుకు సాయమందించిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. సకాలంలో డబ్బులు అందజేస్తున్న రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అంటూ నినదించారు. ఇప్పటికే సాగు పనుల్లో నిమగ్నమైన అన్నదాతలు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రైతులు పత్తి, కంది, జొన్న, సోయాబీన్ విత్తనాలను విత్తే పనుల్లో బిజీ అయ్యారు.
రైతన్నకు అండగా..
యాసంగి వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి మద్దతు ధర అందిస్తూ రైతులకు తెలంగాణ సర్కార్ అండగా నిలుస్తున్నది. వానకాలం సాగు సమయానికి పెట్టుబడి సాయం అందజేసి కొండంత భరోసాను కల్పించింది. రైతులు నష్టపోకుండా నకిలీ విత్తనాల బెడదను రూపుమాపేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నది. పోలీస్, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో టాస్క్ఫోర్సు బృందాలను ఏర్పాటు చేయగా, నకిలీ విత్తనాలు అమ్మే కేంద్రాలపై అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
25వ తేదీలోగా..
తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు కింద పెట్టుబడి సాయాన్ని దశవారీగా ఈ నెల 25వ తేదీ వరకు రైతుల ఖాతాల్లో జమచేయనున్నది. ఇటీవల జరిగిన భూముల అమ్మకాలు, కొనుగోళ్లు, సాగు భూమి నుంచి ఇతర అవసరాల కోసం మారిన భూముల వివరాలను అధికారులు అప్డేట్ చేశారు. దీంతో గత సీజన్ కంటే రైతుల సంఖ్య పెరిగింది. పార్ట్-బీ నుంచి పార్ట్-ఏలోకి చేరిన భూములకు కూడా రైతుబంధు సాయం అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
రంగారెడ్డి జిల్లాలో..
అన్నదాతల శ్రేయస్సు కోసం రైతుబంధు సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసింది. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 3,24,795 మంది రైతులకు ఎకరాకు రూ.5వేల చొప్పున రూ.373.68కోట్ల పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నది. మంగళవారం జిల్లావ్యాప్తంగా 88,816 మంది రైతులకుగాను, రూ.28 కోట్ల 34 లక్షలను వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. లబ్ధిపొందిన రైతులు గ్రామ గ్రామాన సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. గతంలో పెట్టుబడి కోసం బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగేవారు. ప్రస్తుతం సర్కారు సాయమందిస్తుండడంతో లాగోడికి రంది తీరింది. ఇబ్రహీంపట్నం డివిజన్లో 79408 మంది రైతులకు రూ.96.68కోట్ల రైతుబంధు సాయం అందనున్నది. ఇబ్రహీంపట్నం మండలంలోని ఉప్పరిగూడ గ్రామంలోని రైతువేదికలో గ్రామ సర్పంచ్ రాంరెడ్డి, మండల రైతుబంధు సమితి కన్వీనర్ మొద్దు అంజిరెడ్డి, ఎంపీపీ కృపేష్ల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.