చెక్పోస్టుల్లో పూర్తి వివరాలు సేకరించాలి
వికారాబాద్ కలెక్టర్ పౌసుమి బసు
కొడంగల్ మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
కొడంగల్, మే 15: రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నింటా చర్యలు తీసుకుని కొనుగోళ్లు చేపట్టాలని వికారాబాద్ కలెక్టర్ పౌసుమి బసు సూచించారు. మండలంలో కలెక్టర్ శనివారం ఆకస్మికంగా పర్యటించి రావులపల్లిలోని చెక్పోస్టు, కొడంగల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. తెలంగాణ- కర్ణాటక సరిహద్దులోని రావులపల్లి గ్రామ చెక్ పోస్టులో రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చే వారి పూర్తి వివరాలు సేకరించాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. చెక్పోస్టులో పూర్తిస్థాయి సిబ్బంది విధిగా హాజరు కావాలన్నారు. వైద్య సిబ్బంది కూడా ఎల్లప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. కొడంగల్లోని మార్కెట్ యార్డ్లో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఇప్పటి వరకు ఎంత మంది రైతుల నుంచి ఎంత ధాన్యం కొనుగోలు చేశారు, ధాన్యం నిల్వ ఎంత, ఎంత తరలించారు తదితర అంశాలపై మార్కెట్ అధికారి దేవదత్తును కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కొనుగోళ్లకు సంబంధించి రికార్డులు పూర్తి స్థాయిలో అందుబాటులో లేవని, ఈ విధంగా ఉంటే రైతులకు డబ్బులు చెల్లించడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని అన్నారు. ఎప్పటికప్పుడు రికార్డులను ఎంట్రీ చేసి ఉంచాలని ఆదేశించారు. ప్రస్తుతం కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే ఎంపిక చేసిన రైస్మిల్లులకు తరలించాలన్నారు. ధాన్యం తరలించేందుకు లారీలు, కొనుగోలు చేసేందుకు గన్ని బ్యాగుల కొరత ఉందని మార్కెట్ సిబ్బంది కలెక్టర్కు తెలిపారు. స్పందించిన ఆమె వెంటనే పరిశీలించి తగు చర్యలు చేపడుతానని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ సమ్యానాయక్, డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్తో పాటు టీటీ రాములు పాల్గొన్నారు.