కొత్తూరు, ఏప్రిల్ 5 : సమైఖ్య ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామం అది. గుంతల రోడ్డు, తాగునీరు దొరక్క అనేక అవస్థలు, కనీస మౌలిక వసతులు లేక ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతం. అయితే కొత్తూరు మండలంలోని సిద్ధాపూర్ ఏడేండ్ల కాలంలో ఎనలేని అభివృద్ధి సాధించింది. గ్రామంలో మెరిసిపోయే సీసీ రోడ్డు, గ్రామం నడిబొడ్డున పల్లెప్రకృతి వనం, నర్సరీ, రోడ్డుకు ఇరువైపులా హరితహారంలో నాటిన మొక్కలు, వైకుంఠధామం, డంపింగ్యార్డు ఇలా ఒకటేమిటి.. గ్రామంలో ఎక్కడ చూసినా ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తుంది. ఏడేండ్లకాలంలో జరిగిన అభివృద్ధిని చూస్తే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది ఇందుకు కాదా అనిపిస్తుంది. పల్లెప్రగతికి సీఎం కేసీఆర్ చూపుతున్న శ్రద్ధ సిద్ధాపూర్ గ్రామ అభివృద్ధిని చూస్తే తెలుస్తుంది. ప్రభుత్వం కేటాయించిన నిధులతో గ్రామాన్ని ఎంత అభివృద్ధి చేయొచ్చో నిరూపించారు అక్కడి అధికారులు, ప్రజాప్రతినిధులు.
ఊరంతా తళతళ మెరిసే రోడ్డు
గత ప్రభుత్వాల కాలంలో ఊర్లో అన్నీ మట్టి రోడ్లే. అయితే గ్రామంలో ఇప్పుడు అన్ని వీధుల్లో సీసీ రోడ్లు వేశారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.30 లక్షలతో 6 సీసీ రోడ్లు, రూ.18 లక్షలు ఎస్డీఎఫ్ నిధులతో 4 సీసీ రోడ్లు, సీడీపీ నిధులు రూ.13 లక్షలతో మరో రోడ్డు నిర్మించారు. రోడ్లన్నింటినీ ప్రతిరోజూ శుభ్రపరిచి చెత్తను గ్రామపంచాయతీ ట్రాక్టర్లో కంపోస్టు యార్డుకు తరలిస్తున్నారు. రూ.14.18 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ను నిర్మించారు.
సూపర్స్టార్ మహేశ్ దత్తత గ్రామం సిద్ధాపూర్
సిద్ధాపూర్ను సూపర్స్టార్ మహేశ్బాబు దత్తత తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. రూ.3.3 లక్షలతో బస్షెల్టర్, రూ.10.70 లక్షలతో హెల్త్ సబ్ సెంటర్, రూ.7 లక్షలతో వెటర్నరీ హెల్త్ సబ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ప్రైమరీ స్కూల్లో రెండు గదులను నిర్మించారు.
ఊరంతా హరితమయం..
గ్రామలో మొత్తం 4000 మొక్కలు నాటి వాటిని పెంచుతున్నారు. గ్రామం మధ్యంలో పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసి ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటి వాటికి ట్రీగార్డులు ఏర్పాటు చేశారు. గ్రామపంచాయతీ వాటర్ ట్యాంకర్తో వారానికి రెండు సార్లు చెట్లకు నీరు పోసి పెంచుతున్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా వెయ్యి మొక్కలు నాటారు. గ్రామంలో వైకుంఠధామాన్ని నిర్మించి దాన్ని వాడుకలోకి తెచ్చారు.
ప్రతిరోజూ మిషన్ భగీరథ నీరు
గత ప్రభుత్వాల కాలంలో తాగునీటి కోసం అనేక ఇబ్బందులుపడేవారు. ఊర్లో కరెంటు సరిగ్గా ఉండేది కాదు. నల్లాలు వచ్చేవి కావు. వారం రోజులకు ఒక్కసారి కూడా నల్లానీరు వచ్చేది కాదు. ఆ నల్లా నీటి కోసం అర్ధరాత్రి వరకు వేచిచూసేవారు. కానీ నేడు సీఎం కేసీఆర్ పుణ్యమా అని ప్రతిరోజూ కావాల్సినంత నీటిని వదులుతున్నారు. నీటి కోసం బిందె పట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి గ్రామంలో కనిపించదు. ఇంటింటికీ మిషన్ భగీరథ నీటిని నల్లాల ద్వారా వదులుతున్నారు.
పల్లెల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం : తులసమ్మ, సర్పంచ్, సిద్ధాపూర్
పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నది. గ్రామంలోని ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాం. ప్రతిరోజూ సరిపడ మిషన్ భగీరథ నీటిని నల్లాల ద్వారా పంపిణీ చేస్తున్నాం. గ్రామంలోని అన్ని వీధులకు సీసీ రోడ్లు నిర్మించాం. గ్రామపంచాయతీ సిబ్బందితో రోడ్లను ప్రతిరోజూ శుభ్రం చేయించి ఈ చెత్తను డండింగ్ యార్డుకు తరలిస్తున్నాం. గ్రామం మధ్యలో పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసి ఆహ్లాదంగా మార్చాం. వైకుంఠధామాన్ని నిర్మించి అందుబాటులోకి తెచ్చాం.
అన్ని విధాలుగా అభివృద్ధి : ప్రవీణ్యాదవ్, సిద్ధాపూర్
గతంతో పోల్చితే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు లేవు. రోడ్ల పక్కన మొక్కలు నాటి వాటికి వారానికి రెండుసార్లు నీళ్లు పోస్తున్నారు. అన్ని మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేశారు. గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఇవీ కూడా చదవండి…
నెల్లికల్ ప్రాజెక్టు సీఎం కేసీఆర్ చలవే : మండలి చైర్మన్
రైతులను ఆదుకునేందుకే ధాన్యం కొనుగోలు కేంద్రాలు
‘వయోపరిమితి పెంపు వెంటనే అమలయ్యేలా చూడాలి’