బొంరాస్పేట : గ్రామాలు, గిరిజన తండాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని మేడిచెట్టుతండా, సంట్రకుంటతండా, ఈర్లపల్లి గ్రామాల్లో పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం, డంపింగ్ యార్డులను ప్రారంభించారు. మహాంతిపూర్ గ్రామ శివారులో రూ. 3 కోట్లతో నిర్మించిన చెక్డ్యాంను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాలలో నరేందర్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 500 జనాభా ఉన్న ప్రతి గిరిజన తండాను సీఎం కేసీఆర్ గ్రామ పంచాయతీలుగా చేశారని అన్నారు.
పంచాయతీలుగా మారిన తరువాత గిరిజన తండాలకు ప్రభుత్వం పరిపాలన నిర్వహించడానికి ఒక పంచాయతీ కార్యదర్శిని నియమించిందని, ప్రతి తండా పంచాయతీకి పల్లె ప్రగతి ద్వారా నిధులు మంజూరు చేయించి వైకుంఠధామం, ప్రకృతివనం, డంపింగ్ యార్డు, చెత్త సేకరణకు ట్రాక్టర్ను మంజూరు చేసిందన్నారు. గిరిజన తండాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. మిగిలిన తండాలకు బీటీ రోడ్లు, కొత్తగా ఏర్పాటైన తండా పంచాయతీలకు గ్రామ పంచాయతీ భవనాలు నిర్మిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఆసరా పింఛన్ల అర్హత వయస్సును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించి వచ్చే నెల పింఛన్లు అందిస్తామని, రైతులకు ఈ నెల 16వ తేదీ నుంచి రూ. 50వేల పంట రుణాలను మాఫీ చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ హేమీబాయి, జడ్పీటీసీ హాన్ అరుణాదేశు, వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు మహేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోట్ల యాదగిరి, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు చాంద్పాషా, నాయకులు టీటీ రాములు, నరేష్గౌడ్, మహేందర్, సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు.