శామీర్పేట, ఏప్రిల్ 24: సేవ చేయాలనే మనసు ఉండాలే గానీ ఏదీ అడ్డుకాదు. ఇదే అంశాన్ని రుజువు చేస్తూ 60 ఏండ్ల వయసులోనూ వృద్ధులు, వితంతువులు, వికలాంగులను గుర్తించి తనకు తోచిన సాయం చేస్తూ తృప్తి పొందున్నాడు అల్వాల్కు చెందిన టీఎం జాన్. ముఖ్యంగా చిన్న పిల్లల్లో పోషకాహార లోపాలను సరిదిద్దేందుకు కృషి చేస్తున్నాడు. వారికి క్రమం తప్పకుండా సన్నబియ్యం, రవ్వ పంపిణీ చేస్తున్నాడు.
అల్వాల్కు చెందిన టీఎం జాన్ దంపతులకు పిల్లలు లేరు. దీంతో సేవ చేయాలనే ఆలోచనతో దాసర్లపల్లి కుష్ఠువ్యాధి పునరుద్ధరణ కేంద్రంలో ఉద్యోగిగా చేరాడు. ఎందరికో సేవలందించాడు. గతేడాది పదవీ విరమణ పొందాడు. అయినా ఆయన సేవామార్గాన్ని వీడలేదు. తుర్కపల్లి గ్రామంలో ఉన్న పరిచయాలు.. అక్కడ వికలాంగులు ఎక్కువగా ఉన్న విషయాన్ని తెలుసుకొని క్యాన్డిడ్ ఫౌండ్ ట్రస్ట్ ద్వారా సేవలందించడం మొదలు పెట్టాడు. ప్రతి నెల 10న గ్రామంలోని వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు సన్నబియ్యం, రవ్వ పంపిణీ చేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో ఈ నెల నుంచి నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలన్న ఆలోచనలో ఉన్నాడు.
చిన్నప్పటి నుంచి నాకు నలుగురికి మంచి చేయాలనే ఆలోచన ఉండేది. నాకు పిల్లలు లేని కారణంగా సేవా మార్గం ఎంచుకున్నా. అనేక సంవత్సరాలు కుష్ఠు వ్యాధి పునరుద్ధరణ కేంద్రంలో పని చేశా. అక్కడ పదవీ విరమణ చేసిన అనంతరం నేరుగా సేవ చేయాలనే ఆలోచనతో క్యాన్ డిడ్ ఫౌండ్ ట్రస్ట్ను ఏర్పాటు చేశా. తుర్కపల్లిలోని వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు కావాల్సిన సేవలందిస్తున్నా. ముఖ్యంగా చిన్నారులకు పోషకాహారం అందిస్తున్నా. – టీఎం జాన్, క్యాన్డిడ్ వ్యవస్థాపకుడు
చిన్నారుల్లో పోషకాహార లోపం పోగొట్టాలనే సంకల్పంతో ఉన్న జాన్ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. తుర్కపల్లి గ్రామంలోని సుమారు 25 మంది చిన్నారులను గుర్తించి వారికి గోధుమ రవ్వ, పల్లీలు, రాగులు, కాజు, ఇతర చిరుధాన్యాలతో కూడిన బెల్లంపట్టీలను తయారు చేసి పంచిపెడుతున్నాడు.