ఇబ్రహీంపట్నం, ఆగస్టు 5 : ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన రాచకొండ ప్రాంతాన్ని పర్యాటక, సాంస్కృతిక క్షేత్రంగా తీర్చిదిద్దడంతోపాటు ఇబ్రహీంపట్నం ప్రాంతానికి జీవనాధారమైన పెద్ద చెరువును పర్యాటక ప్రాంతంగా ఏర్పాటు చేయాలని కోరుతూ.. గురువారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి కిషన్రెడ్డిని నగరంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో విద్యనభ్యసించి దేశంలోనే ఉన్నతమైన మంత్రి పదవిని పొందినందున ఇబ్రహీంపట్నం ప్రాంత అభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలన్నారు.
ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో బోటింగ్ ఏర్పాటు చేయడంతోపాటు పెద్ద చెరువు పరిసరాలను ట్యాంక్బండ్ తరహాలో అభివృద్ధి చేయడం కోసం నిధులు కేటాయించాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి కిషన్రెడ్డి రాచకొండ అభివృద్ధిపై సమగ్ర నివేదిక తయారు చేయాలని కేంద్ర పురావస్తుశాఖ (ఆర్కియాలజీ విభాగం) అధికారులను ఆదేశించారు. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.