కొడంగల్ : కొడంగల్ పట్టణానికి చెందిన మహేష్ కుమారుడు కిరణ్ జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభను కనబరిచి గోల్డ్ మెడల్ సాధించడంతో పాటు అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. కిరణ్ ప్రస్తుతం హైదరాబాద్లోని అమితి జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో విద్యను అభ్యసిస్తున్నాడు. హర్యానా రాష్ట్రంలో ఈ నెల జరిగిన 7వ ఒలింపిక్ జాతీయ స్థాయి పోటీల్లో కిరణ్ పరుగు పందెం పోటీలో పాల్గొన్నాడు. 800 మీటర్స్ రన్నింగ్ రేస్లో పాల్గొని తక్కువ సమయంలోనే లక్ష్యాన్ని సాధించడంతో గోల్డ్ మెడల్ను అందుకున్నాడు. అదే విధంగా ట్రిపుల్ చేజ్ పోటీలో కూడా పొల్గొని గోల్డ్ మెడల్ను సాధించి అందరి మన్ననలను పొందాడు.
ఒకేసారి రెండు గోల్డ్ మెడల్స్ను సాధించి వచ్చే నెల మలేషియాలో జరిగే అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు కిరణ్ తెలిపాడు. సామాన్య కుటుంబానికి చెందిన అబ్బాయి జాతీయ స్థాయిలో ప్రతిభను కనబరిచి అంతర్జాతీయ స్థాయికి ఎంపిక కావడంపై స్థానికులు ప్రత్యేకంగా అభినందించారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడని పేర్కొన్నారు.