బాన్సువాడ రూరల్, జూన్ 23 : గూడు లేని నిరుపేదలకు గూడు కల్పించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సహకారంతో గ్రామంలో నిరుపేదలందరికీ డబుల్బెడ్రూం ఇండ్లను మంజూరు చేస్తామని ఇబ్రహీంపేట్ తండా సర్పంచ్ ప్రేమ్సింగ్ అన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోని కృష్ణానగర్ తండాలో డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి స్థానిక నాయకులు, అధికారులతో కలిసి బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తండాకు ఇప్పటికే 25 ఇండ్లు మంజూరు చేశారని, ఇండ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. కొత్తగా మరో 10 ఇండ్లు మంజూరు చేశారని చెప్పారు. గ్రామంలో ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి స్పీకర్ పోచారం కృషితో ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పీఆర్ ఏఈ శంకర్, ఇబ్రహీంపేట్ సర్పంచ్ నారాయణరెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ ప్రసన్న కుమార్, ఉప సర్పంచ్ గణేశ్, వార్డు సభ్యులు వసంత్, రంజిత్కుమార్, తండా పెద్దలు బాబుసింగ్, కిషన్ నాయక్, మణిరాం తదితరులు పాల్గొన్నారు.