లక్నో : ఉత్తర్ ప్రదేశ్ లో ఇటీవల ముగిసిన పంచాయతి ఎన్నికల విధుల్లో పాల్గొన్న 1600 మంది టీచర్లు కరోనా మహమ్మారి బారినపడి మరణించారని పలు ఉపాధ్యాయ సంఘాలు చేసిన వ్యాఖ్యలను యూపీ ప్రభుత్వం తోసిపుచ్చింది. ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారిలో కేవలం ముగ్గరు ప్రభుత్వ ఉపాధ్యాయులే కొవిడ్-19తో మరణించారని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాధమిక విద్యా శాఖ అధికారులు సేకరించిన సమాచారం ప్రకారం తాము ఈ వివరాలు వెల్లడించామని ప్రభుత్వం పేర్కొంది.
మరణించిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించే ప్రక్రియను చేపట్టామని తెలిపింది. ఈసీ నిబంధనల ప్రకారం పోలింగ్ కు ముందు రోజు, పోలింగ్ జరిగే రోజు, మరుసటి రోజు మాత్రమే ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పాల్గొన్నట్టు పరిగణిస్తామని పంచాయత్ రాజ్ అదనపు ముఖ్య కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. ఈ మూడు రోజుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా దాన్ని ఎన్నికల విధుల్లో మరణించినట్టుగా పరిగణిస్తారని, ఎన్నికల విధులు ముగిసిన పదిరోజుల తర్వాత ఎవరైనా కరోనా పాజిటివ్ గా నిర్ధారణకు గురై ఆ తర్వాత మరికొద్ది రోజులకు మరణిస్తే దాన్ని ఎన్నికల విధుల్లో ఉండగా మరణించినట్టు గుర్తించబోరని పేర్కొన్నారు.కాగా, ఎన్నికల విధుల్లో పెద్ద సంఖ్యలో టీచర్లు మరణించగా ఈ సంఖ్యను యూపీ ప్రభుత్వం కుదించిందని ఉపాధ్యాయ సంఘాలు ఆక్షేపిస్తున్నాయి.