సీఎం ఆర్ఎఫ్తో పేద కుటుంబాలకు ఎంతో మేలు కలుగుతున్నది
ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్/ధారూరు, జూలై 17: పేదలకు మెరుగైన వైద్యం అందాలనే ఉద్దేశంతో సీఎంఆర్ఎఫ్ను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో వికారాబాద్, ధారూరు, బంట్వారం మండలాలకు చెందిన సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో ప్రైవేటు దవాఖానల్లో చికిత్స చేయించుకునే పేదలను సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ఆదుకుంటున్నదన్నారు. వికారాబాద్ మున్సిపల్లో 13 మందికి రూ.11.08 లక్షలు, ధారూరు మండలానికి చెందిన ముగ్గురికి రూ.1.73 లక్షలు, బంట్వారం మండలానికి చెందిన ఒకరికి రూ.60వేలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు.
కలిసి మెలిసి పనులు చేసుకోవాలి
మార్కెట్ యార్డులో హమాలీలు పాత్ర కీలకమని, వారు కలిసి మెలిసి పనులు చేసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సూచించారు. శనివారం వికారాబాద్ మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో హమాలీలకు దుస్తులు పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఏడాది మార్కెట్ యార్డ్లో హమాలీలకు విందులు నిర్వహిస్తూ, అందరికీ దుస్తులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, ఏఎంసీ చైర్మన్ విజయ్కుమార్, వైస్ చైర్మన్ నర్సింహులు, పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, ధారూరు మండల అధ్యక్షుడు వేణుగోపాల్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, వైస్ ఎంపీపీ విజయ్, మాజీ జడ్పీటీసీ షరీఫ్, పట్టణ ఉపాధ్యక్షుడు వేణుగోపాల్, కౌన్సిలర్లు, డైరెక్టర్లు, సెక్రటరీ వెంకట్రెడ్డి పాల్గొన్నారు
ధారూరులో..
మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. పేదల ఆరోగ్యం కోసం ప్రభుత్వం చాలా పథకాలు తీసుకొస్తున్నదన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేణుగోపాల్రెడ్డి ఉన్నారు.