వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమి బసు
క్షేత్రస్థాయిలో పంటపొలాల పరిశీలన
ధారూరు, జూలై 15 : రైతులు జంట సాళ్ల సాగు పద్ధతిని అనుసరిస్తూ అంతర పంటగా మొక్కజొన్నను సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయని వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమిబసు అన్నారు. గురువారం ధారూరు మండలం ఎల్ఎన్ తండా, ధారూరు స్టేషన్, ధారూరు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు.
ధారూరులో రైతు లక్ష్మయ్య పొలంలో కంది సాగు చేసిన జంట సాళ్ల పద్ధతిని, అంతర పంటగా మొక్కజొన్న పంటను, ధారూరు స్టేషన్లో యంత్రంతో వరి నాటు విధానాన్ని, ఎల్ఎన్ తండాలో రైతు రాములు నాయక్ పంట పొలంలో తక్కువ ఖర్చుతో సాగు విధానాన్ని పరిశీలించారు. ఎకరానికి 10-12కిలోల విత్తనాలు అవసరమవుతాయని, 15 రోజుల వ్యవధిలో నారు నాటుకోవచ్చని.. దీని ద్వారా కూలీల సంఖ్య తగ్గి ఖర్చు తగ్గుతుందని రైతులకు కలెక్టర్ తెలిపారు. రైతులను సాగు చేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ధారూరు క్లస్టర్ రైతు వేదికలో రైతులకు అవగాహన కల్పించారు.
వర్షాకాలంలో పంటలకు తెగుళ్లు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కలెక్టర్ వివరించారు. రైతులకు ప్రభుత్వం రైతు బీమా అందిస్తున్నదని, తమ అవసరాలకు అనుగుణంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చునని సూచించారు. ప్రతి నెల బ్యాంకర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి రైతు రుణాలపై సమీక్షిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా వ్యవసాయశాఖ అధికారి గోపాల్, వికారాబాద్ డివిజన్ వ్యవసాయశాఖ అధికారి వినోద్కుమార్, ధారూరు ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ సుజాత, వైస్ ఎంపీపీ విజయ్కుమార్, సర్పంచులు చంద్రమౌళి, పాండు, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు వీరేశం, మండల వ్యవసాయ శాఖ అధికారి జ్యోతి, ఏఈవో సంజీవ్రాథోడ్, ఎంపీటీసీ బసప్ప ఉన్నారు.
తెగిన రోడ్లను పునరుద్ధరించాలి
పెద్దేముల్/ధారూరు, జూలై 15 : వర్షానికి తెగిన రోడ్లను త్వరగా పునరుద్ధరించి ప్రయాణికుల ఇబ్బందులను తీర్చాలని కలెక్టర్ పౌసుమిబసు అన్నారు. గురువారం ధారూరు మండలం నాగసముందర్, మంచన్పల్లి, పెద్దేముల్ మండలంలోని కందనెల్లి, మన్సాన్పల్లి వంతెనలను, వర్షానికి తెగిపోయిన రోడ్లను ఆర్అండ్బీ అధికారులతో కలిసి పరిశీలించారు. రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. మన్సాన్పల్లి బ్రిడ్జి వద్ద ప్రమాదాలు జరుగకుండా ఇరువైపులా మెటల్ బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వికారాబాద్ నుంచి తాండూరు మార్గంలో గల కందనెల్లి వాగు వద్ద కూడా మరమ్మతులు చేపట్టి తెగిపోయిన దారిని పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. మంబాపూర్ వద్ద దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఈఈ లాల్ సింగ్, తాండూరు డీఈ శ్రీనివాస్, ఏఈ శ్రవణ్ పాల్గొన్నారు.