తక్షణ అమలుకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం
జిల్లాలో 57-64 ఏండ్ల మధ్య ఉన్న అర్హులు 13,371
కొత్తవారికి వచ్చే నెల నుంచి అందనున్న పింఛన్
కుటుంబంలో ఒకరికే ఇవ్వాలని ఆదేశం
2019 నవంబర్లో వివరాలు సేకరించిన గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు
ప్రస్తుతం జిల్లాలో 96,569 మంది ఆసరా పింఛన్దారులు
నెలకు రూ.20 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం
వికారాబాద్, ఆగస్టు 2, (నమస్తే తెలంగాణ): వృద్ధాప్యం మనిషికి శాపం కాకుండా గౌరవంగా బతకాలన్న సదుద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్ రూ.2016ను అందజేస్తున్నది. ప్రస్తుతం 65 ఏండ్లు ఉన్నవారికి పింఛన్లు అందుతుండగా, ఎన్నికలప్పుడు వయోపరిమితిని 57 ఏండ్లకు తగ్గిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్… ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు. పింఛన్ల ప్రక్రియను వేగవంతం చేసి, వచ్చే నెల నుంచి అమల్లోకి వచ్చేలా తాజాగా నిర్ణయం తీసుకున్నారు. 2019 నవంబర్లో గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సేకరించిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లాలో 57-64 ఏండ్ల వయస్సుగల వారు 13,371 మంది అర్హులున్నట్లు గుర్తించారు. రెండేండ్ల సమయం గడిచిన కారణంగా అర్హుల జాబితాను మరోసారి పరిశీలించనున్నారు. పలు నిబంధనల ప్రకారం కుటుంబంలో ఒకరికే పింఛన్ అందించనున్నారు. ప్రస్తుతం జిల్లాలో 96,569 మంది ఆసరా పింఛన్ లబ్ధిదారులు ఉండగా, ప్రతి నెలా రూ.20 కోట్లకుపైగా ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. ఆసరా పింఛన్ల వయోపరిమితిని తగ్గించడంతో అర్హులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గత ఎన్నికల్లో ఇచ్చిన 57 ఏండ్లకే సామాజిక పింఛన్ హామీని వెంటనే అమలు చేసి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాబినేట్ మీటింగ్ సందర్భంగా ఆదేశాలు జారీ చేయడంతో వృద్ధాప్య పింఛన్దార్లలో ఆశలు రేకెత్తిస్తున్నది. 57 ఏండ్ల వారికి పింఛన్ మంజూరు చేస్తామని ప్రకటించడంతో ఆశావహుల్లో ఆనందం వెల్లివిరిస్తున్నది. వృద్ధాప్య పింఛన్ వయస్సును 57 ఏండ్లకు కుదిస్తూ ఆసరా మంజూరు చేస్తామని ప్రకటించారు. దీంతో రెండేళ్ల కిందట అధికారులు 57-64 ఏళ్ల మధ్య అర్హులను గుర్తించి జాబితాలను పంపించారు. కుటుంబంలో ఒక్కరికే పింఛన్ పద్ధతిని కొనసాగించాలని.. భర్తచనిపోతే భార్య, భార్య చనిపోతే భర్తకు పింఛన్ను బదిలీ చేయాలని, ఈ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. వికారాబాద్ జిల్లాలోని 18 మండలాలు, 4 మున్సిపాలిటీల పరిధిలో ఇప్పటికే 96,569 మంది వివిధ కేటగిరీలలో పింఛన్లు తీసుకుంటున్నారు. కొత్తవారితో కలిపి జిల్లాలో 1,09,940మందికి పెన్షన్లు అందనున్నాయి.
రుణమాఫీకి బ్యాంకర్లు కసరత్తు
రూ.50వేల వరకు రుణమాఫీని చేసేందుకు బ్యాంకర్లు కసరత్తు చేస్తున్నారు. బ్యాంకుల్లో తీసుకున్న రూ.50వేల లోపు రుణాలను కూడా మాఫీ చేయాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో రాజ్యాంగ సవరణ చేసి 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తీసుకువచ్చింది. ఇదే విధానాన్ని రిజర్వేషన్లు అమలు చేసేందుకు శ్రీకారం చుట్టనున్నారు. వీటితో పాటు జిల్లాలో దోబీఘాట్లు, సెలూన్లకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలని తీసుకున్న నిర్ణయాన్ని వారంలోగా సంపూర్ణంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో దాదాపుగా 900 సెలూన్లు, 8దోబీఘాట్లు, 550లాండ్రీ షాపులు ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్ర క్యాబినేట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
13,371మంది అర్హుల గుర్తింపు
ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆసరా పింఛన్ల సాయాన్ని భారీగా పెంచింది. దివ్యాంగులకు రూ.3016, వృద్ధులు, వితంతు, ఒంటరి మహిళ, బోదకాలు, గీత, బీడీ కార్మికులు.. తదితరులకు రూ.2016 చెల్లిస్తున్నది. ఇప్పటికే జిల్లాలో అన్ని కేటగిరీలకు సంబంధించి 96,569 మంది ఆసరా పింఛన్లు పొందుతున్నారు. జిల్లాకు ప్రతి నెల సుమారు రూ.20కోట్లకు పైగా ప్రభుత్వం మంజూరు చేస్తుంది. పింఛన్ సాయం అధికంగా పెంచడంతో చాలా మంది దరఖాస్తు చేస్తుకున్నారు. ప్రస్తుతం 65 ఏండ్ల నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లను మంజూరు చేస్తున్నారు. రెండేళ్ల కిందట ఈ వయస్సును 57కు కుదిస్తూ పింఛను మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అధికారులు 57-64 ఏండ్ల మధ్య వయసు గల వారి వివరాలను సేకరించారు. అనంతరం ఎంపీడీవోలు అర్హులను గుర్తించి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయానికి పంపించారు. జిల్లాలో 13,371మంది అర్హులను గుర్తించి జాబితాలను కలెక్టర్ ఆమోదంతో ప్రభుత్వానికి నివేదించారు. వచ్చేనెల నుంచి వృద్ధాప్య పింఛన్ మంజూరు చేస్తామనడంతో దరఖాస్తుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరో 5వేలపైగా దరఖాస్తులు పెండింగ్
వృద్ధాప్య పింఛన్లే కాకుండా ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, దివ్యాంగులు, వితంతువులు.. ఇలా చాలా మంది పింఛన్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో 5వేల మంది దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు అర్హులుగా గుర్తించారు. కలెక్టర్ ఆమోదంతో ప్రభుత్వానికి జాబితా పంపించారు. వీరితో పాటు వివిధ కేటగిరీలకు చెందిన మరో 1000 మంది దరఖాస్తులు మండల స్థాయిలో పరిశీలించి గ్రామీణాభివృద్ధి శాఖలో లాగిన్లో పంపారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే జిల్లా అధికారులు వీటిని ఆమోదించి నివేదించే అవకాశం ఉంటుంది. తద్వారా మరింత మందికి ఆసరా చేకూరుతుంది.
13,371 మంది పింఛన్లకు అర్హులు
జిల్లా వ్యాప్తంగా 13,371 మంది వృద్ధాప్య పింఛన్లకు అర్హులుగా గుర్తించాం. దివ్యాంగులకు రూ.3016 వృద్ధులు, వితంతు, ఒంటరి మహిళ, బోదకాలు, గీత, బీడీ కార్మికులు తదితరులకు రూ. 2016 ప్రభుత్వం అందిస్తుంది. ఇప్పటికే 96,569 మంది ఆసరా పింఛన్లు పొందుతున్నారు. కొత్తవారితో కలిపి జిల్లాలో 1,09,940మందికి పెన్షన్లు రానున్నాయి.
-కృష్ణన్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి, వికారాబాద్ జిల్లా