పరిగి, అక్టోబర్ 25 : ఉద్యమ సమయంలో ఓ డిమాండ్ కోసం ఎత్తిన చేతి సంతకంతో ప్రజాభీష్టాన్ని నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది. ఉద్యమ నాయకుడే పరిపాలకుడైతే సుపరిపాలన అందించవచ్చన్నది నిరూపితమైంది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సందర్భంలో వికారాబాద్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు కావాలన్న ప్రజల డిమాండ్ సహేతుకమైందని, తమ మద్దతు ఉంటుందని మహానేత కేసీఆర్ తన పర్యటనలో ఎలుగెత్తి చాటారు. రాష్ట్రం సిద్ధించాక వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేసి ప్రజల దగ్గరకు పాలనను చేర్చగలిగారు. సమైక్య పాలనలో మహామహులుగా చెప్పుకునే ఏ ఒక్క నాయకుడు కూడా చేయని విధంగా, సీఎం కేసీఆర్ ఉక్కు సంకల్పంతో ప్రజలకు ప్రభుత్వ పాలనను మరింత చేరువ చేసేందుకు కొత్తగా 23 జిల్లాలను ఏర్పాటు చేశారు. అందులో వికారాబాద్ జిల్లా ఒకటి కావడం గమనార్హం.
ప్రజల కల సాకారం చేసిన ఉద్యమ నాయకుడు..
ఈ ప్రాంత ప్రజల కల వికారాబాద్ జిల్లా ఏర్పాటు. 1990 ప్రాంతం నుంచి వికారాబాద్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలన్నది ప్రజల ఆకాంక్ష, ఈ ప్రాంత యువత డిమాండ్. అనేక రంగాల్లో వెనుకబడిన వికారాబాద్ను జిల్లాగా ఏర్పాటు చేయడం వల్ల అభివృద్ధి సాధ్యమన్నది ప్రజల ఆలోచన. ఇందుకు అనుగుణంగా మూడు దశాబ్దాల కిందే పెద్ద ఎత్తున జిల్లా కేంద్రం చేయాలని, కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్లతో ఉద్యమం కొనసాగింది. అప్పట్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపినా.. ఈ డిమాండ్ పరిష్కారానికి నోచుకోలేదు. అప్పటి పాలకులు, ఆ తర్వాత వచ్చిన పాలకులెవరూ వికారాబాద్ జిల్లా కేంద్రం, కొత్త జిల్లా డిమాండ్ను అసలు పట్టించుకోలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ ప్రాంతంలో జరిగిన అనేక సభల్లో పాల్గొన్న ఉద్యమ నాయకుడు కేసీఆర్ వికారాబాద్ను జిల్లాగా ఏర్పాటు చేయాలనే ప్రజల కల నెరవేర్చాలని అప్పటి పాలకులను డిమాండ్ చేశారు. ఆనాటి పాలకులు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపారు. ఇందులో భాగంగా గతంలో ఉద్యమ సమయంలో ప్రజల తరఫున తాను సైతం చేసిన వికారాబాద్ జిల్లా డిమాండ్ను నెరవేర్చారు. తద్వారా మూడు దశాబ్దాల ప్రజల కల నెరవేరింది.
గ్రామాలు బాగుపడ్డాయి..
గతంలో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాలంటే ఒక రోజు పట్టేది. మారుమూల గ్రామాలు అభివృద్ధికి నోచుకునేవికావు. కానీ కొత్త జిల్లా ఏర్పాటుతో పాలన సజావుగా సాగి గ్రామాలు బాగుపడ్డాయి. కొత్త మండలాల ఏర్పాటుతో గ్రామాలు అభివృద్ధి వైపు పయనిస్తున్నాయి.
పాలన చేరువైంది..
వికారాబాద్ జిల్లా ఏర్పాటుతో ప్రజలకు పాలన చేరువైంది. పాత జిల్లా రంగారెడ్డి ఉన్నప్పుడు పలు అవసరాలు, పనుల నిమిత్తం హైదరాబాద్కు వెళ్లాల్సి వచ్చేది. తెలంగాణ వచ్చాక కేసీఆర్ సారథ్యంలో నూతన వికారాబాద్ జిల్లా ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉన్నది. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
ప్రజా అవసరాలు తీరుతున్నయ్..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేయడంతో వివిధ శాఖల పరంగా పరిపాలన సులభమైంది. జిల్లా కేంద్ర పరిధిలోని ఆయా గ్రామాల ప్రజలకు అవసరాలు త్వరగా తీరుతున్నాయి. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ సౌలభ్యంగా మారింది.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం..
వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్కు జిల్లాప్రజలు రుణపడి ఉంటారు. ఒకప్పుడు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాలంటే హైదరాబాద్కు పోవాల్సి వచ్చేది. ఇప్పుడు పాలన ప్రజలకు చేరువైంది. ప్రత్యేక నిధులతో గ్రామాలు, పట్టణాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి.
ఇబ్బందులు తొలిగాయి..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కులకచర్ల మండలం వెనుకబడినదిగా ఉండేది. నిధులూ అంతంతమాత్రంగానే వచ్చేవి. కొత్త జిల్లా ఏర్పాటుతో కులకచర్ల మండలానికి వికారాబాద్ జిల్లా కేంద్రం దగ్గరైంది. దీంతో అభివృద్ధి చకచకా అవుతున్నది. పల్లె ప్రగతి పనులు చక్కగా కొనసాగుతున్నాయి.
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన మహానేత కేసీఆర్
ఇచ్చిన హామీని సాధ్యమైనంత త్వరగా నెరవేర్చుతూ సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నది. కొత్త జిల్లా ఏర్పాటుతోపాటు ఎన్నో ఏండ్ల ఆకాంక్షను నెరవేర్చిన నేతగా సీఎం కేసీఆర్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. జిల్లా ఏర్పాటు తర్వాత జోన్ల పునర్విభజనలో భాగంగా వికారాబాద్ను జోగులాంబ జోన్లో ఉంచారు. జోగులాంబ జోన్ కంటే చార్మినార్ జోన్లో జిల్లాను చేరిస్తే ఈ ప్రాంత యువతకు ఉద్యోగావకాశాలు దక్కుతాయని ప్రజలు అభిప్రాయపడ్డారు. దీంతో పార్లమెంటు ఎన్నికల సమయంలో జిల్లాలో జరిగిన సభలో వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లోకి మారుస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చారు. గతంలో మూడున్నర దశాబ్దాల కింద ఏర్పడిన మండలాలు ఉండగా, కొత్తగా మండలాలను నెలకొల్పలేదు. వికారాబాద్ జిల్లాలో ఇప్పటికే రెండు మండలాలు ఏర్పాటు చేయగా, మరో కొత్త మండలం ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేయబడింది.
జిల్లా ఏర్పాటు సమయంలోనే కోట్పల్లి మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేశారు. 2021 ఏప్రిల్ 24వ తేదీన 14 రెవెన్యూ గ్రామాలతో చౌడాపూర్ రెవెన్యూ మండలం ఏర్పాటు చేశారు. జిల్లాలో మరో నూతన మండలంగా దుద్యాల రెవెన్యూ మండలాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతున్నది. బొంరాస్పేట్ మండలంలోని 8 రెవెన్యూ గ్రామాలు, కోస్గి మండలంలోని 2, కొడంగల్, దౌల్తాబాద్ మండలాల్లోని ఒక్కొక్క రెవెన్యూ గ్రామాలను కలిపి 12 రెవెన్యూ గ్రామాలతో దుద్యాల రెవెన్యూ మండలంగా ఏర్పాటుకు జూలై 22వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయబడింది. సాధ్యమైనంత త్వరలో ఈ నూతన రెవెన్యూ మండలం సైతం ఏర్పాటు చేయడం జరుగుతుంది. తద్వారా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, పరిపాలనను ప్రజలకు చేరువ చేసే నిర్ణయాల్లో సీఎం కేసీఆర్ ముందంజలో ఉన్నారని చెప్పవచ్చు.