న్యూఢిల్లీ: ఒక మహిళ వింతగా ప్రవర్తించింది. రైలు పట్టాల మధ్యలో ఆమె పడుకున్నది. ఇంతలో ఒక గూడ్స్ రైలు ఆమె మీదుగా వేగంగా వెళ్లింది. అనంతరం పైకి లేచిన ఆ మహిళ ఏమీ జరుగనట్లుగా చేతిలోని మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఐపీఎస్ అధికారి దీపాంషు కబ్రా ఈ నెల 12న ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయ్యింది. ఒక రైల్వే స్టేషన్ వద్ద ఈ సంఘటన జరిగింది. ఎరుపు రంగు కుర్తా ధరించి ముఖాన్ని చున్నీతో కప్పుకున్న ఒక మహిళ ఫ్లాట్ఫారం సమీపంలోని రైలు పట్టాల మధ్యలో పడుకుంది. ఒక గూడ్స్ రైలు వేగంగా ఆమె పైనుంచి వెళ్తుంది. రైల్వే స్టేషన్ ఫ్లాట్ఫామ్పై ఉన్న ఆ మహిళకు తెలిసిన వ్యక్తి మొబైల్లో దీనిని రికార్డు చేశాడు.
గూడ్స్ రైలు వెళ్లిన తర్వాత ఆ మహిళ పైకి లేచింది. తన చేతిలోని మొబైల్లో ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుంది. ఫ్లాట్ఫాంపై వీడియో రికార్డ్ చేసిన వ్యక్తితో కూడా మాట్లాడి ఏమీ జరుగనట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
కాగా, ‘ఫోన్ పర్ గాసిప్ జ్యాదా జరూరి హై’ అనే క్యాప్షన్తో పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా పలు విధాలుగా స్పందించారు. ఆమె చాలా క్యాజువల్గా రైలు పట్టాల మధ్యలో పడుకుని, రైలు వెళ్లిన తర్వాత లేచి అక్కడి నుంచి వెళ్లిపోయిందని, ఇది రోజు జరిగేదే అన్నట్లుగా ఆమె ప్రవర్తించిందని కొందరు వ్యాఖ్యానించారు. ఆ మహిళ మానసిక పరిస్థితిపై ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. మరికొందరు ఇమోజీలతో ఫన్నీ కామెంట్లు చేశారు.
फ़ोन पर gossip, ज़्यादा ज़रूरी है 🤦🏻♂️ pic.twitter.com/H4ejmzyVak
— Dipanshu Kabra (@ipskabra) April 12, 2022