ముప్పై ఏళ్లుగా తమకు పరిచయమైన ‘ముత్తు’ ఒక మహిళ అని తెలిసి ఆ ప్రాంతవాసులంతా షాకయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని తూత్తుకుడిలో వెలుగు చూసింది. మూడు దశాబ్దాల క్రితం పెచియమ్మాల్ అనే 20 ఏళ్ల అమ్మాయికి పెళ్లయింది. వివాహమైన 15 రోజులకే భర్త చనిపోయాడు. అప్పటికే నెల తప్పిన పెచియమ్మాల్ తర్వాత ఒక అమ్మాయికి జన్మనిచ్చింది.
కూతురిని తనే పోషించాలని నిర్ణయించుకున్న ఆమె.. మరో వివాహం చేసుకోలేదు. సొంతంగా పని చేయడం మొదలు పెట్టింది. కానీ ఎక్కడ పని చేస్తున్నా ఆమెను కొందరు లైంగిక వేధింపులకు గురిచేసేవారు. దీంతో ఏం చెయ్యాలా? అని ఆలోచించిన ఆమె.. మగాడిలా మారితే ఈ తిప్పలు తప్పుతాయని భావించింది. అందుకే జుట్టు కట్ చేసుకొని క్రాఫ్ పెట్టుంది. చీరలు మానేసి లుంగీ వేసుకునేది. బాత్రూంకు వెళ్లాల్సి వచ్చినా మగాళ్ల బాత్రూంనే వాడేది. బస్సుల్లో కూడా మగాళ్ల సీట్లలోనే కూర్చునేది.
ఇలా 30 ఏళ్లలో పెచియమ్మ.. ‘‘ముత్తు’’గా మారింది. పరోటా షాపుల్లో పనిచేస్తూ ‘‘ముత్తు మాస్టర్’’ అనిపించుకుంది. ఆధార్, ఓటర్ కార్డుల్లో కూడా అదే పేరు పెట్టుకుంది. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాలున్నా సరే.. డబ్బులు కట్టి మగాడిగానే ప్రయాణించేది. ఇంతకాలం తర్వాత తన కుమార్తె షన్ముగసుందరికి ఇటీవలే పెళ్లి చేసేసింది.
ఇప్పుడు 57 ఏళ్ల వయసులో ఇక తను మళ్లీ మహిళగా మారాలని అనుకోవడం లేదని, ముత్తుగానే చనిపోతానని అంటోంది. అయితే తనకు ప్రభుత్వం నుంచి పెన్షన్ అందితే దాంతో బతుకుతానని చెప్పింది. తన కోసం తల్లి ఎంత కష్టపడింతో తెలిపిన షన్ముగసుందరి కూడా.. తల్లికి ప్రభుత్వం నుంచి పెన్షన్ అందితే చక్కగా బతుకుతుందని పేర్కొంది.