డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతున్నది. ఈ వర్షాలు, వరదలవల్ల ఆ రాష్ట్రంలో ఇప్పటికే 17 మంది మృతిచెందారు. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గౌలా నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నది. అయితే ఈ నదీ ప్రవాహంలో హల్దుచౌర్, లాల్కువాన్ మధ్య ఓ ఏనుగు చిక్కుకుపోయింది.
అటవీ ప్రాంతంలో నదిలో సేదదీరేందుకు వచ్చిన ఏనుగు ఒక్కసారిగా వరదలు పోటెత్తడంతో అందులోనే చిక్కుకుపోయింది. ప్రవాహం నడుమ మునగకుండా ఉన్న కొద్దిపాటి నేలపైకి చేరుకుని నిలబడిపోయింది. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు ఆ ఏనుగును ప్రవాహం తక్కువగా ఉన్న ప్రదేశం గుండా అడవిలోకి మళ్లించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.