అమరావతి : పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ( War ) వాతావరణాన్ని ఆసరాగా చేసుకుని ఏపీలో నిత్యవసర ధరలు ఆకాశనంటుతున్నాయని వైఎస్ జగన్ మోహన్రెడ్డి ( YS Jagan Mohan Reddy ) ఆరోపించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అద్దంకి నియోజకవర్గ నాయకులతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంటనూనె ధరలు లీటర్కు రూ. 40 వరకు, పప్పుల ధర కిలోకి రూ.15 పైగా పెంచేశారని అన్నారు. బ్లాక్లో సిలిండర్లను రూ. 2 వేలకు, రూ. 3 వేలకు అమ్ముతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కిరోసిన్ ఇస్తామని చంద్రబాబు అంటున్నారని, ఇప్పుడు కొత్తగా కిరోసిన్ స్టౌవ్లు కొనుక్కోవాలా అంటూ ఎద్దేవా చేశారు.
ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలోనూ చంద్రబాబుది క్రెడిట్ దోపిడి చేస్తున్నారని పేర్కొన్నారు. 2022లో దావోస్ పర్యటనలో ఆదిత్య మిట్టల్ తనతో సమావేశమై రూ. 4.800 కోట్లు గ్రీన్కోలో పెట్టుబడులు పెట్టారని తెలిపారు. గూగుల్ విషయంలోనూ క్రెడిట్ దోపిడి చేస్తున్నారని విమర్శించారు.
వైసీపీ హయాంలో మూడు ప్రభుత్వ రంగ పోర్టులు తీసుకువచ్చామని, రెండేళ్లు గడిచినా పోర్టుల్లో పనులు ముందుకు సాగడం లేదని, పోర్టులకు చుట్టుపక్కల మళ్లీ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. నియోజకవర్గ విభజనల వల్ల పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుందని తెలిపారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు పెరిగే అవకాశాలున్నాయని తెలిపారు. కష్టపడే కార్యకర్తలకు జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్ద పీట వేస్తామని వైఎస్ జగన్ వెల్లడించారు.