లక్నో: దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండగా, బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్లో కరువు పరిస్థితి నెలకొన్నది. గత కొన్ని నెలలుగా వర్షాలు కురియడం లేదు. వర్షా కాలం ఆరంభమైనప్పటికీ వరుణుడు కరుణించలేదు. దీంతో పంటలు వేయలేని దుస్థితిలో రైతులున్నారు. కరువు వల్ల అన్నదాతలతోపాటు పశుగ్రాసం కోసం పశువులు అల్లాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక రైతు ఏకంగా ‘వరుణ దేవుడి’పై ఫిర్యాదు చేశాడు. వర్షాభావ పరిస్థితికి కారణమైన ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరాడు. గ్రీవెన్స్ డేలో ఈ మేరకు ఫిర్యాదు పత్రాన్ని అధికారులకు అందజేశాడు. అయితే దానిని పూర్తిగా చదవని అధికారి తదుపరి చర్యల కోసం ఉన్నతాధికారులకు పంపారు. దీంతో ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
యూపీలోని గోండా జిల్లాలో శనివారం ఫిర్యాదుల పరిష్కార రోజును నిర్వహించారు. ఝలా గ్రామానికి చెందిన రైతు సుమిత్ కుమార్ యాదవ్, వర్షాలు కురిపించనందుకు ఏకంగా వరుణ దేవుడిపై ఫిర్యాదు చేశాడు. ‘గత చాలా నెలలుగా వర్షాలు పడలేదని గౌరవనీయమైన అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాను. కరువు కాటకాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి వ్యవసాయం, పశువులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నది. దీంతో కుటుంబాల్లోని మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కావున, ఈ విషయంలో బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము’ అని ఫిర్యాదు పత్రంలో రాశాడు. వర్షాలు కురిపించనందుకు ఇంద్ర దేవుడిపై తాను ఫిర్యాదు చేస్తున్నట్లుగా అందులో పేర్కొన్నాడు.
మరోవైపు ఈ ఫిర్యాదును పూర్తిగా చదవని రెవెన్యూ అధికారి ఎన్ఎన్ వర్మ దీనిపై (వరుణ దేవుడిపై) అత్యవసర చర్యల కోసం ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. ఆ మేరకు ఆయన స్టాంప్ వేసి సంతకం చేశారు. ఈ ఫిర్యాదును జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపారు. దీంతో ఈ ఫిర్యాదు లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, దీనిపై తెగ కామెంట్లు రావడంతో రెవెన్యూ అధికారి వర్మ స్పందించారు. అలాంటి ఫిర్యాదు ఏదీ తన వద్దకు రాలేదని తెలిపారు. ఆ లేఖపై ఉన్న స్టాంప్ నకిలీదని ఆరోపించారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత విభాగాలకు మాత్రమే పంపుతామని అధికారులకు కాదని చెప్పారు. ఎవరో దురుద్దేశంతో కావాలనే ఇది చేసినట్లుగా తెలుస్తున్నదని, దీనిపై దర్యాప్తు చేస్తామని అన్నారు. అయితే ఆ ఫిర్యాదు లేఖపై స్టాంప్తోపాటు ఆయన సంతకం కూడా ఉండగా దాని గురించి ఆయన ప్రస్తావించలేదు.