న్యూఢిల్లీ : అస్వస్థతతో బాధపడుతున్న చిరుత పులికి ఓ మహిళ రాఖీ కడుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాజస్ధాన్కు చెందిన ఈ వైరల్ ఫోటో ప్రకృతితో సహ జీవనానికి, జీవ వైవిధ్యానికి అద్దం పడుతుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నందా ఈ ఫోటోను షేర్ చేశారు.
ఈ వైరల్ పిక్చర్లో పింక్ శారీ ధరించిన మహిళ అస్వస్ధతతో బాధపడుతున్న చిరుత పులికి రాఖీ కడుతూ కనిపించింది. రాజస్ధాన్లో ఓ మహిళ వన్యప్రాణి పట్ల బేషరతు ప్రేమను ప్రదర్శిస్తూ అస్వస్ధతతో కూడిన చిరుతను అటవీ శాఖకు అందించే ముందు దానికి రాఖీ కట్టారని, వన్యప్రాణుల పట్ల ప్రేమ, సోదరభావాన్ని ప్రదర్శించారని ట్విట్టర్లో ఈ ఫోటోను షేర్ చేస్తూ సుశాంత నంద రాసుకొచ్చారు.
మహిళ వన్యప్రాణి పట్ల చూపిన ప్రేమ, ఆప్యాయతలను ఇంటర్నెట్ స్వాగతిస్తుందని ఓ నెటిజన్ వ్యాఖ్యానించగా, చిరుతకు రాఖీ కట్టడం ప్రేమ, ఆప్యాయతలకు సంకేతమని మరో యూజర్ ప్రశంసించారు. దేవుడు ఎన్నో జీవులను సృష్టించాడని, ప్రపంచం కేవలం మనుషులకే కాదని మరో యూజర్ రాసుకొచ్చారు.