శ్రీనగర్: కశ్మీరీ పండిట్ రాహుల్ భట్ను ఉగ్రవాదులు కాల్చి చంపిన ఘటనపై జమ్ముకశ్మీర్లో ఒకవైపు నిరసనలు, మరోవైపు భయాందోళనలు తీవ్రమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మరణించిన ఒక కశ్మీరీ పండిట్ అంత్యక్రియలకు స్థానిక ముస్లింలు సహకరించారు. మత సామరస్యంతోపాటు సోదర భావాన్ని చాటారు. కుల్గాం జిల్లాలోని వైకే పోరా గ్రామంలో ఈ ఘటన జరిగింది. స్థానిక కశ్మీరీ పండిట్ మహిళ, 80 ఏళ్ల దులారీ భట్. బంధువుల ఇంట్లో పెళ్లి కోసం అనంత్నాగ్లోని మట్టన్ ప్రాంతానికి వెళ్లింది. అయితే అనారోగ్యానికి గురైన ఆ వృద్ధురాలు అక్కడ తుది శ్వాస విడిచింది. దీంతో ఆమె మృతదేహాన్ని సొంత గ్రామమైన వైకే పోరాకు తీసుకువచ్చారు.
మరోవైపు ఆ ప్రాంతంలో ముస్లిం కుటుంబాలు ఎక్కువ. హిందూ కుటుంబాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. దీంతో దులారీ భట్ అంత్యక్రియల కోసం స్థానిక ముస్లిం యువకులు ముందుకు వచ్చారు. పాడె ఏర్పాటు నుంచి కట్టెల వరకు అన్నింటిని సమకూర్చారు. కొందరు ముస్లిం యువకులు ఆమె మృతదేహాన్ని పాడెపై మోసారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఆ వృద్ధురాలి అంత్యక్రియలను దగ్గరుండి జరిపించారు.
కాగా, కష్ట సమయంలో తమ కుటుంబం వెన్నంటే ఉండి సహకరించిన స్థానిక ముస్లింలకు దులారీ భట్ కుమారుడు సుభాష్ కుమార్ భట్ కృతజ్ఞతలు తెలిపాడు. 1990లో తన తండ్రి జానకి నాథ్ను చంపారని, అయినప్పటికీ తాము కశ్మీర్ను వీడి పోలేదని చెప్పాడు. స్థానిక ముస్లింలతో కలిసి ఇన్నేళ్లుగా అక్కడే నివసించినట్లు ఆ కశ్మీరీ పండిట్ వెల్లడించాడు.
మరోవైపు మరణించిన దులారీ భట్తో తమ అనుబంధాన్ని స్థానిక ముస్లింలు గుర్తు చేసుకున్నారు. తమ పండుగలు, వేడుకలతోపాటు విషాదాలప్పుడు కూడా ఆమె తమ ఇంటికి వచ్చేదని తెలిపారు. తమ గ్రామంలోని మిశ్రమ సంస్కృతిలో భాగమైన ఆమె అంత్యక్రియలను వారి సంప్రదాయం ప్రకారం నిర్వహించడంలో సహకరించడం తమ కర్తవ్యమని అన్నారు.