Madhya Pradesh | మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛతర్పూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 12 ఏండ్ల బాలుడి పట్ల ఓ వ్యక్తి అత్యంత కర్కశంగా వ్యవహరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తన ఫోన్ను దొంగిలించాడనే నెపంతో ఓ వ్యక్తి 12 ఏండ్ల బాలుడిని బావిలో వేలాడదీశాడు. దాదాపు ఐదు నిమిషాల పాటు బాలుడిని ఒంటి చేత్తో పట్టుకుని అలాగే ఉండిపోయాడు. పైకి లాగమని ఆ బాలుడు ఎంత ప్రాధేయపడినా సదరు వ్యక్తి వినిపించుకోలేదు. అటుగా వెళ్తున్న వారు గమనించి వీడియో తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఘటన సమయంలో ఆ బావిలో సగానికిపైగా నీళ్లు ఉన్నాయి. ఒకవేళ సదరు వ్యక్తి ఆ బాలుడిని కాని వదిలేసి ఉంటే.. నీటిలో మునిగి చిన్నారి మృతి చెందేవాడు. ఈ ఘటన లవకుశ్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
విషయం తెలుసుకున్న లవకుశ్ పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలుడి పట్ల కర్కశంగా వ్యవహరించిన వ్యక్తిని గుర్తించి అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు బాలుడి పట్ల ఆ వ్యక్తి వ్యవహరించిన తీరుని తప్పుబడుతున్నారు. అతను చేసిన పనికి తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.