Bhuban Badyakar | ఇప్పుడు ప్రపంచమంతా ఒక్క కచ్చా బాదమ్ పాట గురించే మాట్లాడుతోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కచ్చా బాదమ్ గురించే చర్చ. పల్లీలు అమ్ముకునే భుబన్ బద్యాకర్ అనే వ్యక్తి పాడిన కచ్చా బాదమ్ పాట వైరల్ అయింది. సెలబ్రిటీలు కూడా కచ్చా బాదమ్ పాటకు స్టెప్పులేసి ఆ వీడియోలను తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశారు. దీంతో ఆ వీడియోకు ఒక్కసారిగా హైప్ వచ్చేసింది.
వెస్ట్ బెంగాల్కు చెందిన భుబన్ బద్యాకర్.. వీధి వీధి తిరుగుతూ పల్లీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. పల్లీలు అమ్మే సమయంలో కచ్చా బాదమ్ అంటూ పాట పాడుతూ పల్లీలు అమ్ముకునేవాడు. ఆ వీడియో వైరల్ అవడంతో ఓవర్ నైట్ సెలబ్రిటీ అయ్యాడు భుబన్.
సెలబ్రిటీ హోదా రాగానే.. ఆయన పాటిన పాటను పలు మ్యూజిక్ ఆల్బమ్స్ కొనుగోలు చేశాయి. దీంతో భుబన్కు డబ్బులు కూడా బాగానే వచ్చాయి. దీంతో ఇక తాను పల్లీలు అమ్మనని.. తనకు ఇప్పుడు సెలబ్రిటీ హోదా వచ్చిందని ఆ మధ్య భుబన్ స్పష్టం చేశాడు. ఓవర్ నైట్ సెలబ్రిటీ కాగానే.. అన్నం పెట్టిన పనిని అలా ఎలా వదిలేస్తారు అంటూ నెటిజన్లు ఆయనపై గుర్రుమన్నారు. దీంతో ఇటీవల బోల్పూర్లో ఓ ఫంక్షన్లో మాట్లాడిన భుబన్.. తనకు సెలబ్రిటీ హోదా ఉన్నా కూడా పల్లీలు అమ్ముతానని చెప్పుకొచ్చాడు. అప్పట్లో పల్లీలు అమ్మనని చెప్పినందుకు అందరికీ క్షమాపణలు చెప్పాడు భుబన్.
నాకు అన్నం పెట్టిన పని అది. నేను చాలా సాధారణ వ్యక్తిని. అలాగే జీవించాలని అనుకుంటున్నా. నేను జనాల దృష్టిలో సెలబ్రిటీని కావచ్చు.. అయినా కూడా ఇదివరకు పల్లీలు అమ్మినట్టుగానే మళ్లీ పల్లీలు అమ్మడం ప్రారంభిస్తా.. అని భుబన్ చెప్పుకొచ్చాడు.