డెహ్రాడూన్: దేశంలో, ప్రధానంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం ఆచారాలు, ఆ మతపరమైన అంశాలపై వివాదం చెలరేగుతున్నది. మరోవైపు హిందువులైన అక్కాచెల్లెళ్లు ఈద్గా కోసం తమ స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. ఉత్తరాఖండ్లోని రుద్రాపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బైల్జుడి గ్రామంలో ధేలా నదిపై వంతెనకు సమీపంలో ఈద్గా ఉంది. సంబంధిత కమిటీకి అక్కడ నాలుగు ఎకరాల భూమి ఉంది. ఈద్ వేడుకల సమయంలో సుమారు 20,000 మంది ముస్లింలు ఇక్కడ నమాజ్ చేస్తుంటారు.
కాగా, ఈద్గాకు పక్కనే లాలా బ్రిజ్నేందన్ ప్రసాద్ రస్తోగికి రెండున్నర ఎకరాల స్థలం ఉంది. ఆయన అన్ని మతాలను సమానంగా చూసేవారు. ఈద్ సయయంలో తమ స్థలంలో నమాజ్కు అనుమతించడగమేగాక ఆర్థిక సహాయం కూడా చేశారు. ఈ నేపథ్యంలో తన స్థలాన్ని ఈద్గాకు విరాళంగా ఇవ్వాలని భావించారు. అయితే 2003లో ఆయన చనిపోయారు. మరణాంతరం ఆయన ఆస్తులను పిల్లలు పంచుకున్నారు. ఈద్గాకు విరాళంగా ఇవ్వాలని భావించిన స్థలం ఆయన ఇద్దరు కుమార్తెలకు దక్కింది.
మరోవైపు లాలా మరణించిన 19 ఏండ్లకు తండ్రి కోరికను నెరవేర్చాలని ఆయన ఇద్దరు కుమార్తెలు నిర్ణయించారు. ప్రస్తుతం అరవై ఏళ్లకుపైగా వయసున్న ఒక కుమార్తె సరోజ్ ఉత్తరప్రదేశ్లోని మీరట్లో, మరో కుమార్తె అనిత ఢిల్లీలో వారి కుటుంబాలతో కలిసి నివసిస్తున్నారు. దీంతో వారిద్దరూ మాట్లాడుకుని ఆదివారం జస్పర్కు వచ్చారు. కాశీపూర్ ఈద్గా కమిటీ అధిపతిని సంప్రదించారు. తమ తండ్రి కోరిక మేరకు ఈద్గా పక్కన ఉన్న తమ స్థలాన్ని ఈద్గాకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. అనంతరం రెవెన్యూ అధికారులను సంప్రదించి ఆ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ స్థల విరాళానికి సంబంధించి తమ తండ్రి పేరుతో ఒక శిలాఫలకాన్ని ఏర్పాటు చేయాలని ఈద్గా కమిటీని కోరారు.
హిందూ అక్కాచెల్లెళ్ల ఉదారతపై ఈద్గా కమిటీ చాలా హర్షం వ్యక్తం చేసింది. ఆ కుటుంబం సహకారాన్ని ఎప్పటికీ మరిచిపోలేమని చెప్పింది. ఇరు మతాల మధ్య బలమైన సామరస్యానికి ఇది అద్దం పడుతుందని పేర్కొంది. దీని చుట్టూ గోడ నిర్మిస్తున్నట్లు తెలిపింది. ఇకపై మరింత మంది ముస్లింలు ఈద్గాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా నమాజ్ చేసుకునేందుకు వీలు కలిగిందని ఆ కమిటీ వెల్లడించింది.