పాట్నా: మరణించిన తల్లి అంత్యక్రియల విషయంపై హిందూ, ముస్లిం సోదరుల మధ్య గొడవ జరిగింది. దహనం చేయాలని హిందూ కుమారుడు, కాదు.. ఖననం చేయాలని ముస్లిం సోదరుడు వాదించుకున్నారు. వారిద్దరూ కోట్లాటకు దిగడంతో చివరకు పోలీసులు జోక్యం చేసుకున్నారు. బీహార్లోని లఖిసరాయ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రైకా ఖాటూన్ అనే మహిళకు తొలుత ముస్లిం వ్యక్తితో వివాహం జరిగింది. వారికి మొహమ్మద్ మొహ్ఫిల్ అనే కుమారుడు జన్మించాడు.
కాగా, కొన్నేళ్లకు ముస్లిం భర్త చనిపోయాడు. అనంతరం రాజేంద్ర ఝా అనే హిందూ వ్యక్తిని ఆ మహిళ పెళ్లి చేసుకుంది. ఈ నేపథ్యంలో హిందూ మతంలోకి మారిన ఆమె తన పేరును రేఖా దేవిగా మార్చుకుంది. రెండో భర్త ద్వారా బబ్లూ ఝా అనే కుమారుడు పుట్టాడు. తొలి భర్త ద్వారా జన్మించిన మొహమ్మద్ కూడా వారితో కలిసే ఉన్నాడు. ఆ కుటుంబంలో మత పరంగా ఎప్పుడూ కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. పదేళ్ల కిందట ఆమె రెండో భర్త కూడా చనిపోయాడు.
మరోవైపు ఆ మహిళ వృద్ధాప్యం వల్ల మంగళవారం మరణించింది. దీంతో తల్లి అంత్యక్రియల విషయమై హిందూ, ముస్లిం సోదరుల మధ్య గొడవ జరిగింది. ముస్లిం మతాచారం ప్రకారం ఖననం చేయాలని అన్న మొహమ్మద్ పట్టుబట్టాడు. అయితే హిందూ మతాచారం ప్రకారం దహనం చేయాలని తమ్ముడు బబ్లూ వాదించాడు. దీంతో ఈ విషయంపై ఇద్దరూ కొట్టుకున్నారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకున్నారు. హిందూ మతంలోకి మారిన నేపథ్యంలో ఆమె మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు.