మేడ్చల్, జూలై 26 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిషేధిత జాబితాలో ప్రభుత్వం చేర్చిన సర్వే నంబర్లను తొలగించేలా చర్యలు తీసుకోరా అని అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, కూకట్పల్లి నియోజకవర్గాల్లోని వివిధ ప్రాంతాల్లో కొన్ని సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో ప్రభుత్వం చేర్చింది. ప్రభుత్వ అనుమతులు ఇచ్చిన లే అవుట్లలోనే ప్లాట్లలోనే సర్కిళ్లలో ఇంటి అనుమతులు పొంది ఇంటి నిర్మాణాలు జరిపిన వాటిని ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ లేవుట్ ప్లాట్లను కొన్ని ప్రాంతాల్లో నిషేధిత జాబితాలో చేర్చడంపై ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిషేధిత జాబితా నుంచి తొలగించాలని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు స్థానిక తహసీల్దార్ల కార్యాలయాలకు వెళ్లి అనేకసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. తమ అత్యవసరానికి ప్లాట్లు, ఇండ్లు విక్రయించుకుందామంటే రిజిస్ట్రేషన్లు కావడం లేదని, తమ ఇబ్బందులు తీరకుండా ఉంటున్నాయని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
తమ అవసరాలకు అత్యవసరంగా ప్లాట్లు, ఇండ్లు అమ్ముకునే వారు ఎన్వోసీల కోసం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత సమయంలో రియల్ ఎస్టేట్ డమాల్ కావడంతో తమ అవసరం కోసం తక్కువ ధరకు అమ్ముకుందామునుకున్నా.. నిషేధిత జాబితాలో ప్రభుత్వం చేర్చడంపై ఎటూ పాలుపోని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. క్రయ, విక్రయదారులు మాత్రం సబ్ రిజిస్టార్ల సూచనలతో తమ వద్ద ఉన్న ధ్రువపత్రాలను తీసుకెళ్లి ఎన్వోసీలు ఇవ్వాలని తహసీల్దార్ కార్యాలయాల్లో మొరపెట్టుకుంటున్నారు. తహసీల్దార్లు మాత్రం ఎన్వోసీలను కలెక్టరేట్లో ఇస్తారని చెబుతుండటంతో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
యూఎల్సీ, ప్రభుత్వ సర్వే నంబర్లను మాత్రమే నిషేధిత జాబితాలో చేర్చాల్సి ఉండగా, ప్రైవేట్ సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో ఎందుకు చేర్చారన్నదానిపై ప్రజలకు అనేక అనుమానాలు వస్తున్నాయి. కాగా, ఎన్వోసీలు తీసుకోవాలంటే అన్ని నివేదికలు రావడానికే నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నందున ఎన్వోసీలు అధికారులు ఎప్పుడు ఇస్తారు. తమ రిజిస్ట్రేషన్లు ఎప్పుడు జరుగుతాయన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నిషేధిత జాబితాలో చేర్చిన సర్వే నంబర్లను తొలగించాలని అధికారులను కోరుతున్నారు.