న్యూఢిల్లీ: సాధారణంగా ఏనుగులు చాలా ప్రశాంతంగా ఉంటాయి. ముచ్చట గొలుపుతూ మనుషులతో మమేకమవుతుంటాయి. అయితే ఏనుగులకు ఆగ్రహం వస్తే భరించడం చాలా కష్టం. వాటిని నియంత్రించడం మనుషులకే కాదు యంత్రాలకూ సాధ్యం కాదు. అందుకు ఉదాహరణగా నిలుస్తున్నది ఈ ఘటన. తవ్వకాలు జరిపే జేసీబీ, ఏనుగు మధ్య జరిగిన పోరుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నది. ‘వైల్డ్ యానిమల్స్ క్రియేషన్’ అనే ఇన్స్టాగ్రామ్లో శుక్రవారం పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
వ్యవసాయ క్షేత్రంలోకి వచ్చిన ఒక ఏనుగును జేసీబీతో తరిమేందుకు ఒక వ్యక్తి ప్రయత్నిస్తాడు. దీంతో తొలుత అక్కడి నుంచి వెళ్లేందుకు కొంత ముందుకు వెళ్లిన ఆ ఏనుగు అనంతరం తగ్గేదేలే అని భావించింది. పరుగున వెనక్కి వచ్చి జేసీబీతో తలపడింది. తన తొండంతో దానిని ముందుకు తోస్తుంది. జేసీబీకి ముందు ఉన్న తవ్వే పరికరంతో గాయపడే ప్రమాదమున్నప్పటికీ ఆ ఏనుగు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.
మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు. ఏనుగు తనను తాను రక్షించుకునేందుకు చేసిన ప్రయత్నాన్ని చాలా మంది సమర్థించారు. ఆ వ్యక్తి జేసీబీతో ఏనుగుపై దాడి చేయడాన్ని తప్పుపట్టారు.