ఇండియాలో ఫ్యాన్సీ నంబర్లు వేలం వేయడం తెలిసిందే. చాలామంది తమ ప్రత్యేకత చాటుకునేందుకు వాహనం ధరకు రెట్టింపు చెల్లించైనా ఈ నంబర్లను సొంతం చేసుకుంటారు. టెలికాం సంస్థలు ఫ్యాన్సీ ఫోన్ నంబర్లను కూడా వేలం వేస్తుంటాయి. ఈజీగా నంబర్ గుర్తుండేలా కొందరు వీటిని కూడా చాలా మొత్తానికి సొంతం చేసుకుంటుంటారు. కాగా, ఓ చండీగఢ్వాసి తన రూ. 15.4లక్షలకు వేలంలో ఫ్యాన్సీ నంబర్ దక్కించుకొని, అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇందులో ఆశ్చర్యం ఏముంది? అని అనుకుంటున్నారా? అతడు ఆ ఫ్యాన్సీ నంబర్ కొన్నది తన లగ్జరీ కారు కోసం కాదు.. తన యాక్టివా కోసం.. ఈ వార్త నెట్టింట వైరల్గా మారింది.
చండీగఢ్ రిజిస్టరింగ్, లైసెన్సింగ్ అథారిటీ.. ఏప్రిల్ 14-16 వరకు సీహెచ్01-సీజే సిరీస్లో ఫ్యాన్సీ నంబర్లు, మిగిలిపోయిన నంబర్ల కోసం వేలం నిర్వహించింది. ఇందులో సీహెచ్01- సీజే-0001 ఫ్యాన్సీ నంబర్ను చండీగఢ్వాసి బ్రిజ్ మోహన్ రూ. 15.4 లక్షలకు దక్కించుకున్నాడు. అయితే, ఈ నంబర్ తన యాక్టివా స్కూటర్ కోసం అని అతడు ప్రకటించడంతో అంతా ఆశ్చర్యపోయారు. రూ. 71,000 స్కూటర్ కోసం రూ. 15.4 లక్షలు పెట్టి ఫ్యాన్సీ నంబర్ కొనడంతో వేలంవేసినవారే షాక్ అయ్యారు. కాగా, ప్రస్తుతం తాను ఈ ఫ్యాన్సీ నంబర్ను తన యాక్టివా బండి కోసమే కొన్నానని, భవిష్యత్తులో కారుకు ఉపయోగించుకుంటానని బ్రిజ్ మోహన్ తెలిపాడు.