Viral News | పెళ్లి.. జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం. మన భారతీయ సంస్కృతిలో ఈ వేడుకకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. బంధువులు, కుటుంబ సభ్యుల మధ్య నూతన వధూవరులు మూడుముళ్ల బంధంతో ఒక్కటవుతారు. అయితే, మధ్యప్రదేశ్లో ఓ విచిత్రమైన వివాహం జరిగింది. అదేంటో ఊహించగలరా..? ఇప్పటి వరకు మనం శునకాలకు ఘనంగా పెళ్లిళ్లు చేయడం విన్నాం.. చూశాం. అయితే మధ్యప్రదేశ్ కరేలీలో ఇద్దరు వ్యక్తులు మాత్రం రెండు పక్షులకు సంప్రదాయబద్ధంగా పెళ్లి జరిపించారు.
పిపారియా ప్రాంతానికి చెందిన రామస్వరూప్ పరిహార్ అనే వ్యక్తి మైనా పక్షిని సొంత కూతురిలా పెంచుకున్నాడు. అదే ప్రాంతానికి చెందిన బాదల్ లాల్ విశ్వకర్మ కూడా ఓ చిలుకను పెంచాడు. దీంతో వీరిద్దరూ ఈ రెండు పక్షులకు పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఈ నేపథ్యంలో మైనా-చిలుకల వివాహానికి ముహూర్తం ఖాయం చేశారు. ఆదివారం గ్రామ పెద్దలు, ప్రజల సమక్షంలో బాజా భజంత్రీల నడుమ రెండు పక్షులకు ఘనంగా పెళ్లి చేసి బరాత్ ఏర్పాటు చేశారు. నాలుగు చక్రాలు కలిగిన చిన్నపాటి జీపుపై పంజరం ఏర్పాటు చేసి గ్రామ వీధుల్లో పక్షుల జంటను ఊరేగించారు. ఈ వింత పెళ్లిని వీక్షించేందుకు పెద్ద ఎత్తున జనాలు రావడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.