ఇండ్లల్లో చిన్నపిల్లలకు వెరైటీ నిక్నేమ్స్ పెడుతుంటాం. ఒక్కోసారి ఆ పేర్లే వారికి స్థిరపడిపోతుంటాయి. ఆ పేరుతోనే జీవితాంతం చలామణి అవుతుంటారు. కాగా, ఓ బాలిక పేరు ఆధార్కార్డులో తప్పు పడింది. ఆ పేరు వింతగా ఉండడంతో ఆమెను స్కూల్లో చేర్చుకునేందుకు యాజమాన్యం నిరాకరించింది.
వివరాల్లోకెళితే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిల్సీ తహసీల్ పరిధి రాయ్పూర్ గ్రామానికి చెందిన దినేష్ తన కూతురు ఆర్తిని స్కూల్లో చేర్పించేందుకు వెళ్లాడు. ఆమె ఆధార్కార్డు చూసిన టీచర్ అవాక్కయ్యారు. అందులో బాలిక పేరు ‘బేబీ ఫైవ్ ఆఫ్ మధు’ (మధు ఐదో సంతానం) అని ఉంది. దీంతో ఆ టీచర్ ఆ బాలికకు అడ్మిషన్ ఇవ్వలేదు. ఈ వార్త సోషల్మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై జిల్లా మేజిస్ట్రేట్ దీపా రంజన్ స్పందించారు. ఆధార్కార్డుల్లో పేర్లను పోస్టాఫీసులు లేదా బ్యాంకుల్లో నమోదుచేస్తారని, అక్కడ తప్పిదం జరిగి ఉంటుందన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుని, బాలికకు న్యాయం చేస్తామన్నారు.