హైదరాబాద్ : రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ప్రముఖ డాక్యుమెంటరీ దర్శకుడు దూలం సత్యనారాయణ మేడారం, జోడేఘాట్, సోమశిల – నల్లమల్ల ఫారెస్టులోని పర్యాటక ప్రదేశాలపై రూపొందించిన టూరిజం ప్రచార వీడియోలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి కోసం అనేక చర్యలు చేపట్టారన్నారు. అందులో భాగంగా కాకతీయుల కాలంలో నిర్మించిన రామప్ప దేవాలయానికి యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలో గుర్తింపు లభించిందన్నారు. అలాగే, వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ భూదాన్ పోచంపల్లి గ్రామాన్ని బెస్ట్ టూరిజం విలేజ్గా గుర్తింపు లభించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు తెలంగాణలోని పర్యాటక ప్రదేశాల పట్ల నిర్లక్ష్యం వహించారన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పర్యాటక ప్రదేశాలలో పర్యాటకుల సౌకర్యాల కల్పన కోసం పెద్ద పీట వేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం లో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయన్నారు. పర్యాటకులు రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రదేశాలను వీక్షించేందుకు పర్యాటక శాఖ అనేక ఏర్పాట్లు చేశామన్నారు. పర్యాటకులు ఉపయోగించుకోవలని పిలుపునిచ్చారు.