New Year | 2023 సంవత్సరం ముగింపునకు వచ్చేసింది. 2024 సంవత్సరానికి వెల్కం చెప్పేందుకు అందరూ రెడీ అవుతున్నారు. అయితే, చాలా మంది వినూత్నంగా న్యూ ఇయర్ను సెలబ్రేట్ చేసుకోవాలని భావిస్తుంటారు. స్నేహితులు, కుటుంబీకులతో కలిసి పార్టీలు జరుపుకోవడం లేదంటే విహార యాత్రలకు ప్లాన్ చేసుకుంటారు. ఈ క్రమంలో భారత్లోని అనేక పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. న్యూ ఇయర్ సందర్భంగా పర్యాటక ప్రాంతాలకు తాకిడి పెరుగుతుంటుంది. ఈ క్రమంలో ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్లాలనుకుంటే.. వెళ్లబోయే ప్రాంతానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకొని వెళ్లే సమయంతో పాటు పర్యటనను సాఫీగా సాగేందుకు అవకాశం ఉంటుంది. ఈ న్యూ ఇయర్కు హిమాచల్ప్రదేశ్లోని హిల్ స్టేషన్స్ను సందర్శించాలనుకుంటున్నారా..? అక్కడ హోటల్స్ ఎంత ఖర్చవుతుంది ? సందర్శించాల్సిన ప్రాంతాలు ఏమున్నాయ్.. అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం రండి..!
శీతాకాలం సీజన్లో హిల్ స్టేషన్ల అందం మరింత పెరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్లోని అనేక హిల్ స్టేషన్లలో హిమపాతం కనిపిస్తుంది. మంచుతో కప్పబడిన ప్రాంతాలను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు. ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం సమయంలో సిమ్లా-మనాలిలో పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. ఈ ఏడాది ఒక్క క్రిస్మస్ సందర్భంగా సిమ్లాలో ఒక్కరోజే 13 వేలకుపైగా వాహనాలు వచ్చాయి. ఇందులో 6వేలు సోలన్ నుంచి సిమ్లాకు, దాదాపు 3వేల వాహనాలు సిమ్లా నుంచి సోలాన్కు వెళ్లాయి. మనాలిలో సైతం దాదాపు పరిస్థితి ఉన్నది. పర్యాటకులతో కిటకిటలాడుతున్న సిమ్లా, మనాలిలో ట్రాఫిక్ జామ్ సమస్య ఎదురైంది. కొత్త సంవత్సరం సందర్భంగా ట్రాఫిక్ సమస్య ఎదురయ్యే అవకాశం ఉన్నది. వాహనాల్లో వెళ్లాలనుకుంటే మాత్రం వారాంతంలోపే పర్యాటక ప్రాంతాలకు చేరుకోవాలి. ఎక్కువ మంది పర్యాటకులు లేని ప్రదేశాలకు వెళ్తే కొత్త వేడుకలను ఆనందంగా జరుపుకునే వీలుంటుంది.
ఢిల్లీ నుంచి సిమ్లా దాదాపు 343 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎనిమిది గంటల్లోనే అక్కడికి చేరుకోవచ్చు. రైలులో వెళ్లినట్లయితే కల్కా నుంచి రైలు మారాల్సి ఉంటుంది. రైలు మార్గంలో బరోగ్ సమీపంలో కిలోమీటర్ కంటే ఎక్కువగా విస్తరించి ఉన్న పొడవైన సొరంగం నుంచి అద్భుతమైన దృశ్యాలను వీక్షించేందుకు అవకాశం ఉంటుంది. ఢిల్లీ నుంచి మనాలికి దాదాపు 503 కిలోమీటర్లు. మనాలికి చేరుకునేందుకు 12 గంటల సమయం పడుతుంది. ఢిల్లీ నుంచి అంబాలా క్యాంట్ వరకు రైలు అందుబాటులో ఉంది. అక్కడ నుండి బస్సుల్లో మనాలికి చేరుకోవచ్చు.
పర్యాటకుల సంఖ్య పెరగడంతో చాలా వరకు హోటల్స్ న్యూ ఇయర్కు ముందుగానే బుకింగ్స్ అవుతున్నాయి. తక్కువ ధరల్లో హోటల్స్ గదులు పొందడం కొంత కష్టంగా మారుతుంది. శీతాకాలం సీజన్ కావడంతో పర్యాటకులు భారీగా వస్తుండడంతో హోటళ్లలో రూమ్ ధరలు సైతం పెరుగుతున్నాయి. న్యూ ఇయర్కు ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్లనున్నట్లయితే.. ముందుగా ఆన్లైన్ హోటల్ బుకింగ్ చేసుకుంటే బెటర్. తద్వారా అక్కడికి చేరుకున్న రూమ్ల కోసం తిరగాల్సిన పని ఉండదు. అదే సమయంలో ఎక్కువ ధర పెట్టాల్సిన అవకాశం రాకుండా ఉంటుంది. న్యూ ఇయర్ సందర్భంగా సిమ్లాలో హోటల్ ఛార్జీ రూ.1,500 కంటే ఎక్కువగానే ఉంటుంది. మనాలిలో ఒకే రోజుకు రూ.1000 వరకు హోటల్ గదులు అందుబాటులో ఉంటాయి. రద్దీ అధికంగా ఉన్న సమయంలో గదుల రేట్లను పెంచే అవకాశాలుంటాయి. ఈ క్రమంలో అడ్వాన్స్డ్ బుకింగ్ చేసుకుంటే ఇబ్బందులుండవు.