Shirdi Tour Package | హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నుంచి షిర్డికి వెళ్లే పర్యాటకుల కోసం తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్టీడీసీ) విమాన ప్రయాణ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతిరోజూ హైదరాబాద్ నుంచి షిర్డీకి బయలుదేరే వారికి రూ.12,499 ధర చొప్పున ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు సంస్థ ఎండీ మనోహర్ తెలిపారు. ఈ ప్యాకేజీలో పర్యాటకులు హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు విమానంలో బయలుదేరి 2.30 గంటలకు షిర్డీ చేరుకుంటారని తెలిపారు. హోటల్లో బస, సాయంత్రం 4.30 గంటలకు షిర్డీ సాయి దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. సాయంత్రం హారతి కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత రాత్రి 7 గంటలకు బాబా థీమ్ పార్కులోని సౌండ్, లైట్ షోను కూడా చూడవచ్చని తెలిపారు.
మరుసటి రోజు ఉదయం 8 గంటలకు పంచముఖి గణపతి మందిర దర్శనం ఉంటుందని, పాత షిర్డీ, ఖండోబా మందిర్, సాయి తీర్థం దర్శనాల అనంతరం మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు విమానంలో బయలుదేరి సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారని పేర్కొన్నారు. హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేర్చడం, షిర్డీలో స్థానికంగా పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లడం కూడా తమదే బాధ్యత అని, భోజనం, వసతి కూడా టికెట్ ధరలోనే ఉంటాయని, కొన్ని దర్శన టిక్కెట్ల ధరను పర్యాటకులే భరించాల్సి ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు 9848540371, 9848125720 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.