హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): రోడ్లు-భవనాలు, గృహనిర్మాణం, న్యాక్, అసెంబ్లీ తదితర శాఖల్లోని ఉద్యోగఖాళీలపై మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సోమవారం ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధశాఖల్లోని ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులతోపాటు శాఖకు కేటాయించిన పోస్టుల్లో ఖాళీలపై సమగ్రంగా చర్చించారు. ఖాళీల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని, భర్తీకి వీలుగా ఖాళీల గుర్తింపుతో సమగ్ర నివేదికను తయారుచేయాలని సూచించారు. ఖాళీల భర్తీ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. త్వరలోనే ఉద్యోగఖాళీలపై పూర్తి సమాచారాన్ని సీఎంకు అందజేస్తామని ప్రశాంత్రెడ్డి చెప్పారు. సమావేశంలో ఆర్ అండ్ బీ, హౌసింగ్ శాఖల ప్రత్యేక కార్యదర్శి విజయేంద్ర బోయి, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, సీఈ సతీశ్, న్యాక్ డీజీ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
అమరుల త్యాగానికి ప్రతీకగా స్మారకం
అమరుల త్యాగాన్ని ప్రతిబింబించేలా హుస్సేన్సాగర్ ఒడ్డున అమరుల స్మారక చిహ్నం నిర్మిస్తున్నట్టు రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. సోమవారం స్మారకచిహ్న నిర్మాణంతోపాటు నూతన సచివాలయం నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేయాలని ఏజెన్సీని, అధికారులను ఆదేశించారు.