హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): దవాఖానల్లో చికిత్స పొందుతున్న కొవిడ్ బాధితుల దగ్గరికి వెళ్లి పరామర్శించి వారి ఆరోగ్యస్థితిగతులను తెలుసుకున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఆదివారం తమిళనాడు సీఎం స్టాలిన్ పీపీఈ కిట్లు వేసుకొని కోయంబత్తూర్లోని దవాఖానల్లోకి వెళ్లి కరోనా బాధితులు, వైద్యులతో మాట్లాడిన తొలి సీఎం అని ఎన్డీటీవీ చెన్నై ప్రతినిధి జే శామ్ డేనియల్ చేసిన ట్వీట్కు అసద్ స్పందించారు. ఈ దేశంలో కొవిడ్ వార్డుల్లో అందుతున్న చికిత్సను ప్రత్యక్షంగా తెలుసుకొని బాధితుల్లో ధైర్యాన్ని నింపిన తొలి సీఎం కేసీఆరేనని పేర్కొన్నారు. హైదరాబాద్ గాంధీ దవాఖానతోపాటు వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్ను సీఎం కేసీఆర్ సందర్శించి బాధితులను పరామర్శించారని శామ్ డేనియల్కు అసద్ ట్యాగ్చేశారు. కాగా, రెండు దవాఖానల సందర్శన సందర్భంగా సీఎం కేసీఆర్ ఎటువంటి పీపీఈ కిట్ వేసుకోకపోవడం గమనార్హం.