ఒకవైపు కరోనా మరోవైపు ఎముకలు కొరికే చలిలో వేలమంది రైతులను వీధిన పడేసిన వారు దేశ భక్తులా? రైతులను ఆదుకొనేందుకు సాయం అందించిన వారు దేశద్రోహులా? ఇదెక్కడి
విచిత్రమైన లాజిక్.. దేశభక్తులని ధ్రువీకరణ
పత్రం ఇవ్వడానికి ఈ మూర్ఖులు ఎవరు?
750 మందికి పైగా అమరులైన రైతు కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.3 లక్షల పరిహారం ప్రకటించడం మనందరికీ గర్వకారణం. భారత ప్రభుత్వం సైతం రూ.25 లక్షలు పరిహారంగా ఇవ్వాలి. రైతులు, ఆందోళనకారులపై పెట్టినకేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలి. -మంత్రి కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రైతు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని వీధుల్లో ఏడాదిపాటు తీవ్ర ఆందోళనలో పాల్గొని అసువులు బాసిన రైతుల కుటుంబాలను ఆదుకోవడంపై బీజేపీ రాష్ట్ర నేతలు చేసిన చిల్లర రాజకీయంపై పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక మానవతావాదిగా, ఎంతో ఆర్ద్రతతో ముఖ్యమంత్రి కేసీఆర్.. రైతులకు సహాయం చేస్తుంటే.. పనికిమాలిన విమర్శలు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. రైతు చట్టాల పోరాటంలో అమరులైన కుటుంబాలను ఆదుకొనేందుకు ముందుకు వస్తే దేశద్రోహులంటారా? అని మండిపడ్డారు. ‘ఒకవైపు కరోనా మరోవైపు ఎముకలు కొరికే చలిలో వేల మంది రైతులను వీధిన పడేసిన వారు దేశ భక్తులా? లేదా రైతులను ఆదుకొనేందుకు సాయం అందించిన వారు దేశద్రోహులా? ఇదెక్కడి విచిత్రమైన లాజిక్.. దేశభక్తులని ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి ఈ మూర్ఖులు ఎవరు?’ అంటూ ఆయన ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘750 మందికి పైగా అమరులైన రైతు కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.3 లక్షల పరిహారం ప్రకటించడం మనందరికీ గర్వకారణం. భారత ప్రభుత్వం సైతం రూ.25 లక్షలు పరిహారంగా ఇవ్వాలని, రైతులు, ఆందోళనకారులపై పెట్టిన కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలి’ అని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ సాగు చట్టాల రద్దు కోసం వీరోచిత పోరాటం చేసి అమరులైన రైతు కుటుంబానికి రూ.3 లక్షలు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించగా, పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, రాజకీయనాయకులు, సినీనటులు, ప్రముఖులు సైతం కేంద్రం పరిహారం ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కేటీఆర్ ట్వీట్పై పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయనాయకులు, నెటిజన్లు స్పందిస్తూ ట్వీట్లు చేశారు. బీజేపీ నేతలపై రాష్ట్రమంతా తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతున్నది.
లఖీంపురి ఖేరి ఘటనతో రైతు రక్తాన్ని కండ్ల చూసిన బీజేపీ దేశ ద్రోహుల గురించి మాట్లాడటం సిగ్గుచేటు. –ఇంద్రకరణ్రెడ్డి, అటవీ, న్యాయ,దేవాదాయశాఖ మంత్రి
మూడు కొత్త రైతు చట్టాలను తీసుకురావడంపై ప్రధాని మోదీ రైతులకు క్షమాపణలు చెప్పారు. కానీ తెలంగాణ బీజేపీ నాయకులు దాని గురించి ఎలాంటి ప్రకటనచేయకుండా, కేసీఆర్ రైతులకు రూ.3 లక్షలు ఇవ్వడంపై మాట్లాడుతున్నారు. –వేముల ప్రశాంత్రెడ్డి, రోడ్లు, భవనాలశాఖ మంత్రి
రైతు సంక్షేమం కోసం కాకుండా రైతుని సంక్షోభానికి గురిచేసిన బీజేపీ విధానాలు, ఆ పార్టీ మీద రైతు ఆగ్రహం, బీజేపీ తోకముడిచిన విధానం ప్రపంచమంతా చూసింది. – జీ జగదీశ్రెడ్డి, విద్యుత్శాఖ మంత్రి
750 మంది రైతులను చంపేస్తే దేశ భక్తులా? అదే రైతు కుటుంబాలకు సాయం చేస్తే దేశద్రోహమా? ఇదేం దేశ భక్తి ? బీజేపీ నేతలు మతి భ్రమించి, మూర్ఖంగా మాట్లాడుతున్నారు. సీఎం కేసీఆర్ ఔదర్యాన్ని చూసి ఓర్వలేక పోతున్నారు. ఆ రైతులే బీజేపీకి తగిన బుద్ధి చెప్తారు. –ఎర్రబెల్లి దయాకర్రావు, పంచాయతీరాజ్శాఖ మంత్రి
రైతులకు సాయం చేస్తానన్న సీఎం కేసీఆర్ విమర్శిస్తున్న బడా జూట్ పార్టీ(బీజేపీ). ఆ పార్టీ నిండా రైతులను ముంచే నాయకులే. –తలసాని శ్రీనివాస్యాదవ్, పశుసంవర్ధకశాఖ మంత్రి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సం జయ్ కొత్త వ్యవసాయ చట్టాలు అసాధారణమైనవని, వాటి ద్వారా రైతులకు నిజమైన స్వేచ్ఛ లభించిందని చెప్పుకొన్నారు. అలాంటప్పుడు ప్రధాని మోదీ ఆ చట్టాలను ఎందు కు రద్దు చేసి, రైతులకు క్షమాపణలు చెప్పారు? –మహమూద్ అలీ, హోం మంత్రి
బండి సంజయ్కి దేశ రైతులంటే విపరీతమైన కోపం ఎందుకు? రైతులకు మంచి విషయం ప్రకటించినప్పుడల్లా బండి ఆ మంచి పనులకు వ్యతిరేకంగా మాట్లాడటం చాలా బహిరంగ సభల్లో స్పష్టంగా కనిపించింది. -శ్రీనివాస్గౌడ్, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి
దేశ సంపదని పెంచడానికి తెలంగాణను ఆర్థికంగా బలోపేతం చేసింది సీఎం కేసీఆర్. నమ్మి ఓటేసిన పాపానికి దేశాన్ని అమ్ముతున్నది బీజేపీ పార్టీ. దేశ ప్రజలు అంతా గమనిస్తున్నారు. – జోగురామన్న, మాజీ మంత్రి, ఎమ్మెల్యే
ఎవరు దేశభక్తుడో, ఎవరు కాదో నిర్ణయించే హక్కు వారికే ఉన్నదన్నట్లు, ప్రశ్నించే వ్యక్తులను దేశద్రోహులుగా బీజేపీ ముద్ర వేస్తూనే ఉన్నది. తెలంగాణ, దేశంతో రైతుల జీవితాలతో ఆడుకుంటున్న బీజేపీకి ‘రైతులకు సాయం చేయడం ‘దేశ ద్రోహానికి’ కొత్త నిర్వచనంలా కనిపిస్తున్నట్లు ఉన్నది. –కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్యే
వ్యవసాయ నల్ల చట్టాలను తెచ్చి రైతులపై బుల్లెట్, లాఠీ ప్రయోగించి, కార్లతో తొక్కించి చంపిన బీజేపీ నాయకులు దేశభక్తులు. రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలిపి, ఉద్యమంలో అసువులుబాసిన రైతులకు రూ.3 లక్షలు పరిహారం ప్రకటించిన కేసీఆర్ దేశద్రోహా? ఇంత దిగజారుడు రాజకీయాలా? –ఏనుగు భరత్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు
ఎవరు దేశద్రోహులు? దేశ పాలకులు చేసిన చట్టాలతో వారి జీవితం అంధకారం కాబోతుందని ఆ నల్ల చట్టాలను రద్దు చేయాలని ఉద్య మం చేసిన రైతులా.. ఆ రైతులను ఆదుకున్న సీఎం కేసీఆరా..? లేక ఆ చట్టాలను రూపొందించి, రైతుల పైకి తూటాలు, కార్లు పంపి చంపి, తిరిగి రద్దు చేసిన దేశ పాలకులా? –వై సతీశ్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్
ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, గాదరి కిషోర్ కుమార్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, రవీంద్ర కుమార్, విద్యాసాగర్రావు, చిట్టెం రాంమోహన్రెడ్డి, రాములు నాయక్, ఎంపీ రంజిత్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి కేటీఆర్ ట్వీట్పై స్పందించారు.