రాష్ట్రంలో నిర్మాణమవుతున్న ఏదైనా ప్రాజెక్టుకు జాతీయహోదా ఇస్తామని కేంద్రం స్వయంగా విభజనచట్టంలో చెప్పింది. ఆ హామీ ప్రకారమే కాళేశ్వరం లేదా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నోసార్లు కేంద్రాన్ని కోరింది. కేంద్రనుంచి మాత్రం ‘ఇకపై ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇవ్వం’ అనే సమాధానమే వచ్చింది. ఆ ప్రకటన తర్వాత కొన్ని వారాలకే బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది. దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలకు కేంద్రాన్ని నిలదీసే దమ్ము లేకుండాపోయింది.
హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): పది రూపాయలిచ్చి వెయ్యి రూపాయల బిల్డప్ కొట్టుడు.. ఒక్క రూపాయి తెచ్చి వంద రూపాయల ప్రచారం చేసుకునుడు.. చెప్పిన గప్పాలే మళ్లీమళ్లీ చెప్పుడు.. ఇలా చేసేవారిని ఇకనుంచి ‘తెలంగాణ బీజేపీ’ అని పిలువాలే మో. రాష్ట్ర సమస్యలు ఏనాడూ పట్టించుకోని బీజేపీ నేతలు, ఎన్నికలప్పుడు మాత్రం ఎక్కడలేని బిల్డప్ ఇస్తున్నారు. ‘అంతా మేమే ఇచ్చాం.. మొత్తం మేమే తెచ్చాం’ అని తప్పుడు ప్రచారం చేయటంలో ఆరితేరి పోయారు. ఏమేం తెచ్చారని గట్టిగా నిలదీస్తే మాత్రం నోరు మెదుపడం లేదు. గత ఏడేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అనేక అంశాలపై విజ్ఞప్తులు చేసింది. వాటిల్లో ఇప్పటికీ 99 శాతం పెండింగ్లోనే ఉన్నాయి. ఇవన్నీ గమనిస్తున్న ప్రజలు.. ‘మీది ఎన్నడన్న కేంద్రం నుంచి తెచ్చిన.. మాకు ఇచ్చిన మొఖమేనా?’ అని చీదరించుకొంటున్నారు.
తెలంగాణ విజ్ఞప్తులు.. ప్రస్తుత పరిస్థితి
ఐటీ హబ్గా మారిన హైదరాబాద్లో ఈ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు యూపీఏ హయాంలో ఐటీఐఆర్ ప్రాజెక్టును కేటాయిస్తే మోదీ సర్కారు వచ్చిన తర్వాత అటకెక్కించింది. సీఎం కేసీఆర్ 2014 జూన్లోనే ఐటీఐఆర్పై ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆ తర్వాత కనీసం పదిసార్లు కేంద్రానికి లేఖలు రాశారు. డీపీఆర్ సమర్పించామని, త్వరలో మంజూరవుతుందని చెప్తూ నాలుగైదేండ్లు కాలయాపన చేసిన కేంద్రం ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని ఐటీఐఆర్ ప్రసక్తే లేదని పార్లమెంట్ సాక్షిగా మోసం చేసింది.