హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్న పలు ప్రైవేటు స్కూళ్లు, అనర్హులతో బోధన చేస్తూ అరకొర విద్యను అందిస్తున్నాయి. పాఠశాలల్లో సిబ్బంది సంక్షేమాన్ని గాలికి వదిలేసి, ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతున్నాయి. కొవిడ్ నేపథ్యంలో మానవీయకోణంలో ప్రైవేటు పాఠశాలల సిబ్బందికి ప్రభుత్వం రూ.2వేల నగదు, 25 కిలోల బియ్యం ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం వివరాలు సేకరిస్తున్న సమయంలో పలు పాఠశాలల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అధికారిక గణాంకాలకు రెట్టింపుస్థాయిలో బోధన, బోధనేతర సిబ్బంది ప్రభుత్వ సాయానికి దరఖాస్తు చేసుకోవడం అధికారులను విస్మయానికి గురిచేస్తున్నది. ప్రైవేటు స్కూళ్లలో టీచింగ్, నాన్టీచింగ్ సిబ్బంది వివరాలను ఆ పాఠశాలలు విధిగా యూ డైస్ పోర్టల్లో నమోదుచేయాలి.
అధికశాతం స్కూళ్లు విద్యార్థుల వివరాలను సరిగానే నమోదు చేసినా సిబ్బంది వివరాలను ఇవ్వటంలేదు. నిబంధనల ప్రకారం స్కూళ్లలో డీఈడీ, బీఈడీ గ్రాడ్యుయేట్లే టీచర్లుగా ఉండాలి. వీరికి ఎక్కువ వేతనాలు ఇవ్వాల్సి వస్తుండటంతో కొన్ని యాజమాన్యాలు ఒకరిద్దరు అర్హులను నియమించి, ప్రాథమికస్థాయిలో బోధనకు అనర్హులను నియమించుకొంటున్నాయి. ఇంటర్, డిగ్రీ చేసినవారితో చదువు చెప్పిస్తున్నాయి. అందుకే వారి వివరాలను యూ డైస్లో నమోదుచేయడం లేదని తెలుస్తున్నది. ప్రభుత్వ సాయానికి దరఖాస్తు చేసినవారిలో భారీసంఖ్యలో బోధనా శిక్షణ పొందనివారు ఉండటం గమనార్హం. అర్హులను కొద్దిమందిని నియమించినా వారికి తక్కువ వేతనాలే ఇస్తున్నాయి. ఒకచోట కంప్యూటర్ తదితర టెక్నికల్ సిబ్బంది 10 మందికి మించి, సాధారణ సిబ్బంది 20కి మించి ఉంటే వారికి తప్పనిసరిగా ఈఎస్ఐ, పీఎఫ్ ఇవ్వాలని కార్మికచట్టాలు చెప్తున్నాయి. ఈ సౌకర్యాలు ఎంతమంది ఉద్యోగులకు కల్పించారన్న వివరాలు ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు ఇవ్వడంలేదని తెలుస్తున్నది. దీంతో ప్రభుత్వ ఇచ్చే ప్రయోజనాలను పొందలేకపోతున్నామని టీచర్లు వాపోతున్నారు.
ప్రభుత్వం ముందుకొచ్చినా అందని సాయం
కొన్ని స్కూళ్లు మినహాయించి రాష్ట్రంలోని అనేక ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోవడంలేదు. ఫీజుల వసూళ్లలోనే కాదు, బోధన, బోధనేతర సిబ్బంది వివరాల నమోదులో కూడా అక్రమాలకు పాల్పడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి మూలంగానే ఈ మాత్రం వివరాలైనా వెల్ల్లడయ్యాయి. ప్రస్తుతం యూడైస్లో నమోదుచేసిన వివరాలు కూడా సరిగాలేవు. అందులో ఎన్రోల్ చేసిన సర్టిఫికెట్లు ఒకరివి, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నది మరొకరు. సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో సాయం చేసేందుకు ముందుకొచ్చినా స్కూళ్ల యాజమాన్యాల అక్రమాల వల్ల అర్హులకు అది దరిచేరని దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రైవేటుస్కూళ్ల బోధన సిబ్బంది వివరాలను నమోదు చేయించాలి.