న్యూఢిల్లీ, ఆగస్టు 2: ఏ లక్ష్యంతో ప్రభుత్వాలు వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఆర్థికసాయం, రాయితీలు ఇస్తున్నాయో.. లబ్ధిదారులు ఆ డబ్బులను వాటి కోసమే ఖర్చు పెట్టేందుకు, నగదు రహిత లావాదేవీలను పెంచేందుకు ప్రధాని మోదీ సోమవారం ‘ఎలక్ట్రానిక్ రూపాయి’(ఈ-రుపీ) డిజిటల్ పేమెంట్ విధానాన్ని ప్రారంభించారు. ‘డిజిటల్ గవర్నెన్స్కు సంబంధించి దేశం ఈ రోజు కొత్త మలుపు తీసుకొన్నది. నగదు రహిత లావాదేవీల్లో ఈ- రుపీ కీలక పాత్ర పోషించబోతున్నది. ప్రభుత్వ పథకాలు మరింత ప్రభావవంతంగా అమలవుతాయి. సంక్షేమ ఫలాలు నేరుగా లబ్ధిదారుడికే చేరతాయి. పథకాలు దుర్వినియోగం కావు’ అని మోదీ ఈ సందర్భంగా అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు లబ్ధిదారుడికి చేరడానికి మధ్యలో ఉన్న అంచెలను తగ్గించడానికి ప్రభుత్వాలు ఎన్నో సంస్కరణలను అమలు చేస్తూ వచ్చాయి. ప్రస్తుతం డబ్బులను నేరుగా బ్యాంకుల ఖాతాల్లో జమచేస్తున్నారు.
ఇలా నగదు బదిలీ చేయడం ద్వారా నకిలీ లబ్ధిదారులను గుర్తించి తొలిగించగలిగామని, తద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ.1.78 లక్షల కోట్లు ఆదా అయిందని ప్రధాని తెలిపారు. గ్యాస్ సబ్సిడీ, ఎరువులపై రాయితీ, పీఎం కిసాన్ ఇలా దాదాపు 300 కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా సుమారు 90 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారన్నారు. వీరి ఖాతాల్లో ఇప్పటివరకు రూ.17.5 లక్షల కోట్లు జమ చేసినట్టు చెప్పారు. దీనిని మరింత ముందుకు తీసుకువెళ్లి నగదు అవసరం లేకుండా చెల్లింపులు చేసేందుకు ఈ-రుపీ వ్యవస్థను తీసుకువచ్చినట్టు చెప్పారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఈ-రుపీని అభివృద్ధి చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ, కేంద్ర ఆరోగ్యశాఖ, నేషనల్ హెల్త్ అథారిటీలు ఇందులో పాలుపంచుకొన్నాయి. ఈ-రుపీతో చెల్లింపు విధానాన్ని మొదట ఆరోగ్య సేవల్లో వినియోగించనున్నారు. తర్వాత మిగతా రంగాలకు విస్తరిస్తారు.
కూపన్లాగా పనిచేస్తుంది
ఈ-రుపీ అనేది ఒక ప్రీపెయిడ్ గిఫ్ట్ వోచర్/కూపన్ లాంటిది. క్యూఆర్ కోడ్ లేదా ఎస్ఎంఎస్ రూపంలో ఉంటుంది. ఎలాంటి కార్డులు, పేమెంట్ యాప్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం లేకున్నా దీనితో చెల్లింపులు చేయవచ్చు. వీటిని బ్యాంకులు జారీచేస్తాయి. ప్రస్తుతం ఎనిమిది బ్యాంకులు ఈ వోచర్లను జారీచేయనున్నాయి.
నిధులు దుర్వినియోగం కాకుండా..
ఈ-రుపీతో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా అడ్డుకోవచ్చు. ఉదాహరణకు ఒక విద్యార్థికి ఏదైనా కాలేజీలో చదవడానికి స్కాలర్ షిప్ జారీచేస్తే ఆ డబ్బును నేరుగా బ్యాంకులో జమ చేయకుండా అంతే మొత్తంలో ఈ-రుపీ వోచర్ను జారీచేస్తే దానిని ఆ కాలేజీలోనే చెల్లించడానికి వీలుంటుంది. అంతే తప్ప ఆ వోచర్ను వేరే అవసరాల కోసం వాడుకోవడానికి వీలు ఉండదు. ఎరువులపై రాయితీపై వోచర్ జారీచేస్తే అది కేవలం ఎరువుల షాపుల్లోనే చెల్లుబాటు అవుతుంది. ఆ డబ్బును వేరే చోట్ల వినియోగించలేం. అమెరికాలో ఈ-రూపాయి తరహాలోనే ఎడ్యుకేషన్ వోచర్, స్కూల్ వోచర్ ఉన్నాయి. వీటిని చదువుకు మాత్రమే చెల్లించే వీలుంటుంది. కొలంబియా, చిలీ, స్వీడన్, హాంకాంగ్లో కూడా ఇలాంటి ఈ-వోచర్ సేవలు ఉన్నాయి.
ఎలా జారీ చేస్తారు?
ఈ వోచర్లను ప్రభుత్వాలే కాకుండా ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు కూడా జారీచేయవచ్చు. ఈ-రుపీతో చెల్లింపు చేయాలనుకొనేవారు ముందుగా బ్యాంకుకు వెళ్లాలి. ఎవరికి, ఎందుకు పంపుతున్నారో కారణాలు తెలుపాలి. పంపాల్సిన మొత్తంలో బ్యాంకు ఈ-రుపీ వోచర్ను జారీచేస్తుంది. లబ్ధిదారుడి ఫోన్ నంబర్కు ఈ వోచర్ క్యూర్ కోడ్/ఎస్ఎంఎస్ వెళ్తుంది. దీని ద్వారా చెల్లింపులు చేయవచ్చు. అయితే ఇక్కడ.. ఈ-రుపీ ఏ ఉద్దేశంతో అయితే పంపారో దానికే వాడాల్సి ఉంటుంది.